న్యూఢిల్లీ: ఆసియాకప్ 2022లో అఫ్గానిస్థాన్పై సెంచరీ సాధించిన తర్వాత అతి కష్టంగా నవ్వానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఈ సెంచరీ కోసం తాను రెండేళ్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చిందని, ఎన్నో బాధలు ఎదుర్కొవాల్సి వచ్చిందని తెలిపాడు. 2019 బంగ్లాదేశ్పై టెస్ట్ సెంచరీ తర్వాత విరాట్ మూడేళ్ల పాటు ఒక్క సెంచరీ చేయలేకపోయాడు.
హాఫ్ సెంచరీలు సాధించినా.. వాటిని సెంచరీలుగా మార్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ కూడా కోల్పోయిన కోహ్లీ.. జట్టులో చోటు కోల్పోయే ప్రమాధాన్ని తెచ్చుకున్నాడు. దాంతో నెల రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కోహ్లీ... గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో అఫ్గానిస్థాన్పై సెంచరీ సాధించాడు.

అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి తొలి శతకం కూడా అదే కావడం విశేషం. ఇది విరాట్ కోహ్లీకి 71వ అంతర్జాతీయ శతకం. ఇక ఆ తర్వాత వన్డేల్లోనూ వెనువెంటనే సెంచరీలు బాది పాత కోహ్లీని తలపించాడు. తాజాగా డిస్నీ హాట్స్టార్లో ప్రసారమయ్యే 'లెట్ దేర్ బి స్పోర్ట్' అనే కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఆ సెంచరీని గుర్తు చేసుకున్నాడు.
'నేను 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. ఒకటే అనుకున్నా.. ఎలాగైనా సెంచరీ సాధించాలి. తర్వాత బంతిని సిక్స్గా మలిచా. సెంచరీ పూర్తి కాగానే అతి కష్టంగా నవ్వగలిగా. ఎందుకంటే దాదాపు రెండేళ్లకుపైగా దీని కోసం ఎదురు చూశాను. ఇందుకేనా నేను బాధపడింది అని అప్పుడు అనిపించింది'' అని కోహ్లీ తెలిపాడు.

టీమిండియా కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను కెప్టెన్గా చాలా తప్పులు చేశాను. కచ్చితంగా దాన్ని ఒప్పుకుంటా. అయితే నేను కెప్టెన్గా ఉన్నప్పుడు చేసిన ప్రతీ పని కూడా నిస్వార్థంగా చేశా. నా కోసం ఏదీ చేయలేదు, టీమ్ గెలవాలని, గెలుస్తుందనే ఆలోచనతో ప్రయత్నించా. అయితే అన్ని సార్లు అనుకున్నవి జరగవు కదా. కొన్ని సార్లు నా ప్లాన్స్ వర్కౌట్ అయితే... ఇంకొన్ని సార్లు రివర్స్ అయ్యాయి.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం 75 శతకాలు (వన్డేల్లో 46, టెస్టులు 28, టీ20ల్లో ఒకటి)తో ఉన్న కోహ్లీ.. సచిన్ వంద సెంచరీల రికార్డును అధిగమించాలంటే విరాట్ ఇంకా 25 సెంచరీలు చేయాలి. వన్డేల్లో మరో నాలుగు చేస్తే సచిన్ (49 సెంచరీలు) రికార్డును అధిగమిస్తాడు.
వన్డే ప్రపంచ కప్, ఆసియా కప్ నేపథ్యంలో సచిన్ రికార్డును బద్దలు కొట్టడం విరాట్కు పెద్దగా కష్టం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లోనూ కోహ్లీ సత్తా చాటుతున్నప్పటికీ.. తక్కువ స్ట్రైక్రేట్తో పరుగులు చేయడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.