బెంగళూరు: ఫుట్ టాస్ బాల్కు ఔటవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 50)హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బౌలింగ్లో అరంగేట్ర పేసర్ విజయ్కుమార్ వైశాఖ్(3/20) చెలరేగాడు.
హాఫ్ సెంచరీతో పాటు మూడు కీలక క్యాచ్లు అందుకొని ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడిన కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాఫ్ సెంచరీతో రాణించినా.. ఫుల్టాస్కు ఔటవ్వడంతో ఇజ్జత్ పోయిందన్నాడు.
'మిచెల్ మార్ష్ హై క్యాచ్ చాలా కష్టమైనది. అది గాల్లో ఉన్నప్పుడు నాకు దగ్గరగా మరే ఫీల్డర్ లేడనే విషయాన్ని నిర్థారించుకున్నాను. దాంతో బంతిని జడ్జ్ చేయడం నాకు సులువైంది.

ఆ తర్వాత అందుకున్న రెండు క్యాచ్లు చాలా సునాయసంగా వచ్చినవే. ఈ మ్యాచ్లో ఫుల్ టాస్కు ఔటవ్వడం చాలా నిరాశకు గురి చేసింది. పరువు పోయినట్లు అనిపించింది. హాఫ్ సెంచరీ తర్వాత నేను మరింత మెరుగ్గా ఆడుతాను. హాఫ్ సెంచరీ అనంతరం 10 బంతుల్లోనే 30-35 పరుగులు చేయాలనుకున్నా. సాధారణంగా నా బ్యాటింగ్ స్టైలే అలా ఉంటుంది.
అలా ఆడితినే జట్టు స్కోర్ 200 ధాటుతుంది. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మా ఆటగాళ్లకు ఈ పిచ్పై 175 పరుగులు ఎక్కువని చెప్పాను. పిచ్ చాలా నెమ్మదించిందని ఈజీగా డిఫెండ్ చేయవచ్చని సూచించాను. కుల్దీప్ బౌలింగ్ను చూసినప్పుడే ఈ విషయం నాకు అర్థమైంది. రెండు ఓటముల తర్వాత విజయాన్నందుకోవడం సంతోషంగా ఉంది. నేను ఏ బంతినైనా హిట్ చేయగలను. మంచి బంతులను, మెరుగైన బౌలర్లను హిట్ చేయాలనే మైండ్సెట్తో బ్యాటింగ్ చేస్తాను.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ మినహా అంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. మనీశ్ పాండే(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో విజయ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వ్యాన్ పార్నెల్, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.