టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకపోవచ్చని తెలిపాడు. కానీ గత పర్యటనల్లోని తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నానని తెలిపాడు. ముఖ్యంగా గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నానని చెప్పాడు. దాంతో మరికొద్ది రోజుల్లో కోహ్లీ.. టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతాడా? అనే చర్చ మొదలైంది.
గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో కోహ్లీతో పాటు టీమిండియా స్టార్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఐదు టెస్ట్ల్లో కోహ్లీ 23.75 సగటుతో 190 పరుగులే చేశాడు. ఇందులో ఒక శతకం ఉండటం గమనార్హం. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ 3 మ్యాచ్ల్లో 31 పరుగులే చేశాడు. ఈ ఇద్దరి వైఫల్యం కారణంగా ఈ సిరీస్లో టీమిండియా ఓటమిపాలైంది.

తాజాగా ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సదస్సులో పాల్గొన్న విరాట్ కోహ్లీ ముందు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం గురించి ప్రస్తావించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను మరోసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకపోవచ్చు. కానీ గత పర్యటనల్లోని నా ప్రదర్శనపై సంతృప్తిగానే ఉన్నాను.'అని కోహ్లీ తెలిపాడు.
టీమిండియా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే టెస్ట్ సిరీస్ కోసం కాకుండా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం వెళ్లనుంది. అయితే టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం పొట్టి ఫార్మాట్కు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయానంతరం వన్డే ఫార్మాట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగినా.. అతను ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే రిటైర్మెంట్ తర్వాత ప్రణాళికలు ఏంటని ప్రశ్నించగా.. ఏమి చేయాలో తెలియదని, ప్రయాణాలు చేస్తానని తెలిపాడు. 'వాస్తవానికి రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తానో నాకు కూడా తెలియదు. ఇటీవల ఇదే ప్రశ్నను నా సహచర ఆటగాడిని అడిగాను. అతను కూడా ఇలానే తెలియదని బదులిచ్చాడు. కాకపోతే నేను బాగా ప్రయాణాలు చేస్తాను.'అని కోహ్లీ బదులిచ్చాడు.