ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులకు ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. దయచేసి తనను కింగ్ అని పిలవద్దని కోరాడు. అలా పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా ఉందని, విరాట్ అని మాత్రమే పిలవాలని సూచించాడు. అప్కమింగ్ సీజన్ నేపథ్యంలో మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా నిర్వహించిన ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్కు వేల సంఖ్యలో హాజరైన అభిమానులను ఉద్దేశించి విరాట్ కోహ్లీ మాట్లాడాడు.
విరాట్ కోహ్లీ మైక్ పట్టుకోగానే అభిమానులు గట్టిగా 'కింగ్'అని అరిచారు. వారి అరుపులతో కాసేపు మౌనంగా ఉన్న కోహ్లీ.. 'అభిమానులారా.. మీరంతా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనకు వెంటనే చెన్నై వేదికగా మ్యాచ్ ఉంది. అప్పటి వరకు మన శక్తిని కాపాడుకోవాలి. మీరు కింగ్ అని పిలుస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఎవరూ నన్ను అలా పిలవకండి. విరాట్ అని మాత్రమే పిలవండి.'అని రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

మహిళల టీమ్ టైటిల్ విజయంతో ఆర్సీబీ కొత్త అధ్యాయనం ప్రారంభమైందని విరాట్ కోహ్లీ కన్నడలో తెలిపాడు. ఈ ఏడాది ఆర్సీబీ టైటిళ్లను డబుల్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 'మా మహిళల టీమ్ టైటిల్ గెలిచినప్పుడు మేమంతా మ్యాచ్ చూస్తున్నాం. ఆ సమయంలో ఆర్సీబీ అభిమానుల స్వచ్చమైన ప్రేమను చూశాం. ఆర్సీబీ టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిందనే ఫీల్ కలిగింది. ఇన్నేళ్ల పాటు అభిమానులు మాపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే డబుల్ చేస్తాం.
గత 16 ఏళ్లుగా టైటిల్ గెలవాలనే దృడ సంకల్పంతోనే బరిలోకి దిగాను. అందుకోసం ప్రతీ ఏడాది సాయశక్తులా పోరాడాను. ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టులో ఉండాలన్నది నా కోరిక. ఆర్సీబీ అభిమానులు, ఫ్రాంచైజీ సహకారాన్ని ఎప్పటికీ మరువలేను. టైటిల్ గెలిచి వారి రుణాన్ని తీర్చుకుంటాను. 'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఆర్సీబీ ఎక్స్వేదికగా అభిమానులతో పంచుకుంది.