
కేప్టౌన్: కెరీర్లో కొత్తగా తాను నిరూపించుకోవాల్సిందేం లేదని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇక గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ.. నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడుతూ సెంచరీ చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇక సౌతాఫ్రికాతో మూడో టెస్ట్ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన విరాట్.. తన ఫామ్పై వస్తున్న విమర్శలపై స్పందించాడు.
''నాకు ఇదేమీ కొత్త కాదు. చాలా రోజులుగా ఈ మాటలు వింటునే ఉన్నా. అలాంటి సమయంలో నేను నెలకొల్పిన రికార్డుల గురించి గుర్తుచేసుకుంటా. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రతిసారి సాయశక్తులను ఒడ్డుతాను. అంతేగానీ.. బయట నా గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోను. అయినా నేను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు'' అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఇక వెన్ను నొప్పితో రెండో టెస్ట్కు దూరమైన కోహ్లీ మూడో టెస్ట్ ఆడటంపై క్లారిటీ ఇచ్చాడు. తాను పూర్తిగా కోలుకున్నానని, మూడో టెస్ట్ బరిలోకి దిగుతానన్నాడు. ఇక తన గైర్హాజరీలో తాత్కలిక కెప్టెన్ టీమిండియాను నడిపించిన కేఎల్ రాహుల్ను కోహ్లీ వెనుకేసుకొచ్చాడు. ''రెండో ఇన్నింగ్స్లో కేఎల్ వికెట్లు తీసేందుకు(బౌలర్ల వ్యూహాలు అమలు చేసేందుకు) ఎంతగానో ప్రయత్నించాడు. కానీ సౌతాఫ్రికా అద్బుతంగా ఆడింది. కాబట్టి అతడు అక్కడ కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఒకవేళ నేను గనుక అక్కడ ఉంటే ఇంకా ఏదైనా వ్యూహాన్ని అమలు చేసేవాడినేమో. అయినా... ఒక్కొక్కరి కెప్టెన్సీ ఒక్కోలా ఉంటుంది'' అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
ఇక తొలిసారి సారథిగా వ్యవహరించిన రాహుల్కు చేదు అనుభవమే మిగిలింది. భారత్కు లక్కీ గ్రౌండ్గా పేరున్న వాండరర్స్లో పరాజయమే ఎదురైంది. దీంతో సౌతాఫ్రికా జట్టు 1-1తో సిరీస్ను సమం చేసింది. జనవరి 11 నుంచి ఆరంభమయ్యే మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టునే విజయం వరించనుంది.