మొహాలీ: ఫాప్ డుప్లెసిస్ సూపర్ బ్యాటింగ్తోనే విజయం సాధించామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 24 పరుగుల తేడాతో గెలుపొందింది. గాయం కారణంగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ మాత్రమే చేయగా.. విరాట్ కోహ్లీ తాత్కలిక సారథిగా జట్టును నడిపించాడు. విజయానంతరం మాట్లాడిన కోహ్లీ.. తమ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.
బ్యాటింగ్లో ఫాఫ్ డుప్లెసిస్, బౌలింగ్లో సిరాజ్ అద్భుతంగా రాణించారని కొనియాడాడు. 'ఈ ఒక్క విజయం, పాయింట్స్ టేబుల్.. మా జట్టు సత్తాను తెలియజేయదు. మరో 13, 14 మ్యాచ్ల వరకు కూడా విజయం కోసం ఇలానే ఆడుతాం. ఈ మ్యాచ్లో ఫాప్ డుప్లెసిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని వల్లే మేం 20-30 పరుగులు అదనంగా చేశాం.

ఈ పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. నాకు తెలిసి వికెట్పై వాటర్ కొట్టనట్టున్నారు. స్పిన్ బౌలింగ్లో బ్యాక్ఫుట్లో సిక్స్లు కొట్టడం చాలా కష్టమైంది. సాధ్యమైనంత వరకు క్రీజులో ఉండి జట్టు స్కోర్ను 190 పరుగులు ధాటించాలనే వ్యూహంతో బ్యాటింగ్ చేశాం. మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్ ఆడటం కష్టమైంది. దాంతో 175 పరుగులు ఈ పిచ్పై సరిపోతుందనే అభిప్రాయం కలిగింది.
మా బౌలర్లకు కూడా ఈ టార్గెట్ సరిపోతుందని చెప్పాను. మ్యాచ్ చివరి వరకు వెళ్లినా భయపడవద్దని, ముఖ్యంగా పంజాబ్ 7 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా ఎదురు దాడికి దిగినప్పుడు మా బౌలర్లతో ప్రత్యేకంగా మాట్లాడాను. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ చివరి వరకు ఉందని, మనకు బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయని, కంగారుపడవద్దని సూచించాను. సిరాజ్ మాత్రం అసాధారణ ప్రదర్శన కనబర్చాడు'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 84), విరాట్ కోహ్లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. ప్రభ్సిమ్రాన్ సింగ్(30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 46), జితేశ్ శర్మ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. హసరంగా రెండు, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.