
మౌంట్ మాంగనూయ్: న్యూజిలాండ్తో మంగళవారం జరిగిన మూడో వన్డేలోను భారత్ ఓటమిపాలైంది. ఫలితంగా 3-0తో క్లీన్స్వీప్కు గురై చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 1989 తర్వాత మూడు అంతకన్నా ఎక్కువ మ్యాచ్లు ఆడిన వన్డే సిరీస్లో క్లీన్స్వీప్ అయిన జట్టుగా కోహ్లీసేన అప్రతిష్టను మూటగట్టుకోనుంది. టీ20 సిరీస్లో క్లీన్స్వీప్కు గురైన న్యూజిలాండ్ అంతకంతకు బదులు తీర్చుకుంది.
అయితే ఈ సిరీస్లో తామేం అంత చెత్తగా ఆడలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. పేలవమైన ఫీల్డింగే తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.
'తొలి మ్యాచ్లో మేం గట్టి పోటీనిచ్చామని అనుకుంటున్నా. ఈ మూడు మ్యాచ్ల్లో మేం చేసిన ఫీల్డింగ్.. కనబర్చిన ఏకాగ్రత అంతర్జాతీయ క్రికెట్కు సరిపోదు. కానీ మేం పుంజుకొని పోటీ ఇవ్వడం సానుకూలాంశం. మేం ఫీల్డ్లో అంతగా రాణించలేదు. న్యూజిలాండ్ మాత్రం మాకన్న బాగా ఆడింది. ఇక టీ20 సిరీస్లో మేం అద్బుతంగా ఆడాం. కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అనుభవం. టీ20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు మరింత కసితో ఆడారు. 3-0తో సిరీస్ను గెలవడానికి వారు అర్హులే. 'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
టెస్ట్ సిరీస్ నెగ్గగలం..
టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా ప్రతీ టెస్ట్ కీలకమేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. సమతూకంతో ఉన్న తమ జట్టు న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'టెస్ట్ చాంపియన్షిప్లో ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే. సమతూకంతో కూడిన మా జట్టు ఇక్కడ సిరీస్ గెలువగలదని భావిస్తున్నా. కానీ మేం సరైన ఆలోచనా ధృక్పథంతో బరిలోకి దిగాల్సి ఉంది.'అని కోహ్లీ తెలిపాడు. ఇక రెండు టెస్ట్ల సిరీస్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.
ఆఖరి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (113 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లతో 112)సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. రాహల్కు తోడుగా శ్రేయస్ అయ్యర్(63 బంతుల్లో 9 ఫోర్లతో 62), మనీష్ పాండే (42), పృథ్వీ షా(40) ఫర్వాలేదనిపించాడు.
అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 305 రన్స్ చేసి 12 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. మార్టిన్ గప్టిల్(66), హెన్రీ నికోలస్ (80) మెరుపులు మెరిపించగా.. చివర్లో గ్రాండ్హోమ్ (58 నాటౌట్) దాటిగా ఆడాడు.