వారి రాకతో ఊపొచ్చింది.. ఆసీస్ను ఓడించాలంటే ఆ ఇద్దరిలానే ఆడాలి: విరాట్ కోహ్లీ

కాన్బెర్రా: ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడించడం తదుపరి సిరీస్లకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. బుధవారం జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో కోహ్లీసేన 13 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్లో అదరగొట్టి.. ఆ తర్వాత బౌలింగ్లో చెలరేగి సూపర్ విక్టరీతో క్లీన్స్వీప్ను తప్పించుకుంది. ఇక ఈ విజయానంతరం మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ ఆటగాళ్ల రాకతో జట్టులో ఊపొచ్చిందన్నాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా భాగస్వామ్యం అద్భుతమని, ఆసీస్ను ఓడించాలంటే ఆ మాత్రం ఆడాలన్నాడు.

పరీక్షకు గురయ్యాం..
‘ఆసీస్ ఇన్నింగ్స్ తొలి, రెండో అర్ధభాగాల్లో మేం పరీక్షకు గురయ్యాం. రెండు సార్లు అద్భుతంగా కమ్బ్యాక్ చేశాం. ఒకరు అరంగేట్రం చేస్తే.. శుభ్మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. ఈ యువ ఆటగాళ్ల రాకతో జట్టులో తాజాదనం వచ్చింది. యువ పేసర్లు రాణించారు. జట్టుకు ఇలాంటి విజయం ఎంతో అవసరం. సిడ్నీతో పోలిస్తే కాన్బెర్రా పిచ్ బౌలర్లకు మెరుగ్గా ఉంది. దాంతో వారి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ పోరులో ఫీల్డింగ్, బౌలింగ్లో మేం అదరగొట్టాం' అని కోహ్లీ అన్నాడు.

కంగారులతో కసిగా ఉండాలి..
ఈ మ్యాచ్లో 63 పరుగులు చేసిన కోహ్లీ.. తన బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. 'నా బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నా. ఇక ముందూ ఇదే జోరు కొనసాగించాలని అనుకుంటున్నా. ఇన్నింగ్స్ను చివరి వరకు తీసుకెళ్లాలని భావించాను కానీ కుదర్లేదు. పాండ్యా, జడేజా భాగస్వామ్యం మాత్రం అద్భుతం. ఆస్ట్రేలియాను ఢీకొట్టాలంటే అలాగే ఆడాలి. కంగారూలతో ఆడేటప్పుడు కసిగా ఉండాలి. ఆ సవాల్కు సిద్ధంగా ఉండాలి' అని విరాట్ పేర్కొన్నాడు.

ఆ ఇద్దరే అడ్డుకున్నారు..
ఈ మ్యాచ్లో తాము బాగానే పోరాడమని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. జడేజా, హార్దిక్ భారత్కు అద్భుతమైన భాగస్వామ్యం అందించారని పేర్కొన్నాడు. వారిలో ఎవరి వికెట్ తీసిన 240 పరుగులే ఛేదించాల్సి వచ్చేదని వెల్లడించాడు. కామెరాన్ గ్రీన్ బౌలింగ్, బ్యాటింగ్లో ప్రభావం చూపించాడని తెలిపాడు. ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడంతో మంచే జరిగిందన్నాడు. క్యారీతో కలిసి మాక్స్వెల్ తిరుగులేని భాగస్వామ్యం అందించాడని ప్రశంసించాడు. టీ20లకు మిచెల్ స్టార్క్ అందుబాటులో ఉంటాడని తెలిపాడు.

మలుపు తిప్పిన బుమ్రా..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' హార్దిక్ పాండ్యా (76 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (50 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిశారు. తర్వాత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (82 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్లు), మ్యాక్స్వెల్ (38 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. శార్దుల్ 3 వికెట్లు, బుమ్రా, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు.
చేధనలో ఆసీస్ 158 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో భారత్కు విజయం ఖాయమవుతున్న తరుణంలో మ్యాక్స్వెల్ ధాటిగా ఆడిన ఇన్నింగ్స్ ఆసీస్ను 268/6 దాకా తీసుకెళ్లింది. ఇక 34 బంతుల్లో 35 పరుగుల విజయ సమీకరణం భారత్ను క్లీన్స్వీప్ చేసేలా కనిపించింది. కానీ బుమ్రా వేసిన 45వ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. మ్యాక్స్వెల్ను ఔట్ చేయడంతో 268 పరుగుల వద్ద ఏడో వికెట్ పడింది. తర్వాత టెయిలెండర్లు 21 పరుగుల వ్యవధిలోనే నిష్క్రమించడంతో ఆసీస్ ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications