Virat Kohli, IND vs NZ 1st semi-final:వన్డేల్లో 50 శతకాలు నమోదు చేయడంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్, జీవిత భాగస్వామి అనుష్క శర్మ ముంగిట ఈ రికార్డు అందుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పాడు.
తన సంతోషాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 50 శతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డ్ను అధిగమించాడు.

ఈ ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన కోహ్లీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. జట్టు విజయం కోసం పరిస్థితులకు తగ్గట్లు ఆడటం నా బాధ్యత. ఈ టోర్నీ ఆసాంతం నేను అలానే ఆడాను. నేను క్రీజులో నిలబడితే ఇతర ఆటగాళ్ల దూకుడుగా ఆడగలరు. ఈ రోజు మేం ఆశించిన రీతిలోనే మా ఇన్నింగ్స్ సాగింది.
మాకు భారీ లక్ష్యం దక్కింది. జట్టు విజయమే నాకు చాలా ముఖ్యం. దాని కోసం నేను ఏమైనా చేస్తాను. సింగిల్స్, డబుల్స్, బౌండరీలు..ఇలా జట్టుకు ఏది అవసరమైతే నేను అది చేస్తాను. ఈ టోర్నీ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ నాకిచ్చిన పాత్రను పోషించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడుతూ.. ఇతర ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేస్తూ.. స్వేచ్చగా ఆడగలిగే అవకాశం కల్పిస్తున్నాను.
చివరి ఓవర్లలో నేను కూడా గేర్ మార్చి ధాటిగా ఆడుతున్నాను. ఈ మ్యాచ్లో సెంచరీ సాధించిన అనంతరం చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఓ వైపు అనుష్క శర్మ, మరోవైపు సచిన్ టెండూల్కర్ ముందు ఈ ఫీట్ సాధించడం నాకు స్పెషల్. ఈ అనుభూతిని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. నేను ఓ చిత్రకారుడిని అయ్యుంటే.. నా అనుభూతిని ఓ అద్భుత చిత్రంతో వివరించేవాడిని.
నేను ఎంతో ప్రేమించే నా జీవిత భాగస్వామి ఓ వైపు.. నా హీరో మరోవైపు ఉండగా.. ఐకానిక్ వాంఖడే స్టేడియంలో నా అభిమానుల ముందు 50వ సెంచరీ అందుకోవడం ఎప్పటికీ మరిచిపోను. అందుకే వినూత్నంగా సంబరాలు చేసుకున్నాను. ఈ మ్యాచ్లో 330-340 స్కోర్ చేస్తే సరిపోతుందనుకున్నాను. కానీ 400 పరుగులు చేయడం అద్భుతం. ఈ క్రెడిట్ పూర్తిగా శ్రేయస్ అయ్యర్దే.
శుభ్మన్ గిల్ వెనుదిరిగిన తర్వాత అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 117), శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 105) శతకాలతో రాణించారు.