Virat Kohli:ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో తాను ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ అచీవ్మెంట్ కాదని, దేవుడిచ్చిన వరమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆ తరహా ఇన్నింగ్స్ ఆడాలనేది తన కలని చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్తో జరిగిన ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో ఓటమి దిశగా సాగిన టీమిండియాను ఆఖరి వరకు క్రీజులో నిలిచి 82 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్తో చిరస్మరణీయ విజయాన్నందించాడు. క్రికెట్ చరిత్రలోనే ఇది ఓ గొప్ప ఇన్నింగ్స్గా నిలిచిపోయింది.

వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఈ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'పాకిస్థాన్పై ఆడిన ఆ అసాధారణ ఇన్నింగ్స్ను ఓ ఘనతగా నేను ఏమాత్రం ఒప్పుకోను. ఆ ఇన్నింగ్స్ నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. ఎన్నో రోజులుగా ఈ తరహా ఇన్నింగ్స్ ఆడాలని కలలు కన్నాను. నేను క్రీజులో నిలబడితే పాకిస్థాన్ భయపడుతుందని నాకు తెలుసు. అప్పుడు పరిస్థితులను నాకు అనుకూలంగా మలుచుకొని వారిపై ఒత్తిడి పెంచాలని అనుకున్నాను. అలానే చేశాను.
ఆ మ్యాచ్ అనంతరం నేను ప్యాడీ ఆప్టన్(టీమిండియా మాజీ మెంటల్ కండిషన్ కోచ్)ను కలిసాను. నీ వల్లే ఈ ఇన్నింగ్స్ సాధ్యమైందని హగ్ చేసుకున్నాను. చాలా మందికి తెలియదు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాతో ఎక్కువగా మాట్లాడి.. మానసికంగా నాకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి ప్యాడీ ఆప్టన్ మాత్రమే. సుదీర్ఘ కెరీర్లో వైఫల్యాలు సాధారణమేనని, గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుతంలో ఉండాలని చెప్పింది అతనే.
ప్రతీ రోజు అతను నాతో మాట్లాడుతూ నా సమస్యలకు పరిష్కారం చూపేవాడు. 'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ.. 9 మ్యాచ్ల్లో 594 పరుగులు చేసి టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు.