టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. గత కొన్ని నెలలుగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడిన కోహ్లీ.. ఇంగ్లండ్తో మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు. పెర్త్ టెస్ట్ సెంచరీ తర్వాత ఆడిన 8 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ల్లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ను వెంటాడి ఔటైన కోహ్లీ.. 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో బరిలోకి దిగి ఆఫ్ స్టంప్ లైన్ బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆదిల్ రషీద్ బౌలింగ్లోనే..
మోకాలి వాపుతో ఇంగ్లండ్తో తొలి వన్డే ఆడిన విరాట్ కోహ్లీ.. రెండో వన్డేలో ఐదు పరుగులే చేసి వెనుదిరిగాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు కీలకమైన ఆఖరి వన్డేలో హాఫ్ సెంచరీ నమోదు చేసి టచ్లోకి వచ్చాడు. కోహ్లీ ఫామ్లోకి వచ్చినా..అతను రెండు వన్డేల్లో లెగ్ స్పిన్నర్ అయిన ఆదిల్ రషీద్కే ఔటవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటి వరకు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలతో ఇబ్బంది పడిన కోహ్లీ.. తాజాగా లెగ్ స్పిన్తో సతమతమవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు లెగ్ స్పిన్ కోహ్లీకి మరో బలహీనతగా మారింది.

స్పిన్ ఆడలేకపోతున్న కింగ్..
ప్రత్యర్థి బౌలర్లంతా కోహ్లీ రాగానే.. లెగ్ స్పిన్నర్లను బరిలోకి దించనున్నారు. ఇంగ్లండ్తో రెండో వన్డేలోనూ కోహ్లీ ఆదిల్ రషీద్ బౌలింగ్లోనూ వెనుదిరిగాడు. మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీతో క్రీజులో సెట్ అయిన తర్వాత డిఫెన్స్ చేయబోయి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తొలి వన్డేలోనూ ఇలానే ఔటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఈ బలహీనతపై ఫోకస్ చేయాలని లేకుంటే.. ప్రతీ జట్టు లెగ్ స్పిన్నర్తో కోహ్లీని ఆడుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. గత నాలుగేళ్లలో విరాట్ కోహ్లీ లెఫ్టార్మ్ స్పిన్నర్లకే 11 సార్లు ఔటయ్యాడు.
భారత్ 356 ఆలౌట్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 112) సెంచరీతో కదంతొక్కగా.. విరాట్ కోహ్లీ(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(4/64) నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు. సకీబ్ మహ్మూద్, గస్ అట్కిన్సన్, జోరూట్ తలో వికెట్ తీసారు.