సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు విరాట్ కోహ్లీ ఆగ్రహంగా చూడటం నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసిన సమయంలో కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వైపు కోపంగా చూశాడు.
దాంతో జట్టులో కోల్డ్ వార్ నడుస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయగా రోహిత్ శర్మ 60వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ బ్యాట్ పైకెత్తి అభివాదం చేస్తుండగా.. టీవీ కెమెరాలు డ్రెస్సింగ్ రూమ్వైపు తిరిగాయి. హెడ్ కోచ్ గంభీర్ కూలింగ్ గ్లాసెస్ ధరించి, ఎలాంటి భావోద్వేగం ప్రదర్శించకుండా చపట్లతో అభినందించాడు.
ఆ తర్వాత కెమెరాలు మైదానంలో ఉన్న విరాట్ కోహ్లీపై ఫోకస్ పెట్టాయి. ఆ సమయంలో కోహ్లీ కోపంగా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ కనిపించాడు. గంభీర్పై కోపంతో అలా చూశాడా? లేక బౌలర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడా? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ అభిమానులు మాత్రం గంభీర్కు కోహ్లీ దమ్కీ ఇచ్చాడని కామెంట్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా వీడియోను కట్ చేసి వైరల్ చేస్తున్నారు.

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ పరాజయం తర్వాత గంభీర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇక కోహ్లీ బాడీ లాంగ్వేజ్ టీమ్ మేనేజ్మెంట్, సీనియర్ ఆటగాళ్ల మధ్య సంబంధాలు సరిగ్గా లేవనే విషయాన్ని తెలియజేస్తున్నాయని కామెంటేటర్లు వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూర్చింది. మరోవైపు కోహ్లీ-రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగారు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేస్తే.. కోహ్లీ సెంచరీతో చెలరేగాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లతో 135) సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57), కేఎల్ రాహుల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, నండ్రే బర్గర్, కార్బిన్ బోష్, ఒట్నిల్ బార్ట్మన్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రిట్జ్కే(80 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 72), మార్కో జాన్సెన్(39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 70), కార్బిన్ బోష్(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/68) నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా(3/65) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్(2/64)కు రెండు వికెట్లు దక్కాయి.