అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పోరాటం ముగిసింది. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరగిన క్వాలిఫయర్-2లో సమష్టిగా విఫలమైన ఆర్సీబీ 7 వికెట్లతో ఓటమిపాలైంది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ ఈసారైనా సొంతం చేసుకుంటుందని అభిమానులు భావించారు. కానీ ఆర్సీబీ ఆటగాళ్ల కీలక మ్యాచ్లో విఫలమై తీవ్రంగా నిరాశపరిచారు. ఇక ఆర్సీబీ ఓటమిపై స్పందిస్తూ ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సీజన్ ఆసాంతం మద్దతుగా నిలిచిన మేనేజ్మెంట్కు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
'కొన్నిసార్లు మనం విజయం సాధిస్తాం, మరి కొన్ని సార్లు విజయం సాధించలేం. కానీ అభిమానులు మాత్రం నిరంతరం మాకు మద్దుతగా నిలిచారు. ఈ అద్భుతమైన ఫ్రాంఛైజీలో భాగమైన మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్, అభిమానుల అందరికీ నా ధన్యవాదాలు. వచ్చే సీజన్లో మళ్లీ కలుద్దాం" అని కోహ్లీ ట్వీట్ చేశాడు.భారీ అంచనాలతో ఈ సీజన్ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 16 మ్యాచ్లాడి 115.59 స్ట్రైక్రేట్తో 341 పరుగులే చేశాడు. ఇందులో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. మూడు సార్లు గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.
రాజస్థాన్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూ రు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్ లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు సాధించి గెలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బట్లర్ (60 బంతుల్లో 106 నాటౌ ట్; 10 ఫోర్లు, 6 సిక్స్ లు) సీజన్లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. రేపు ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ తలపడుతుంది.