
న్యూఢిల్లీ: ఇటీవల పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతని చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కీలక సలహా ఇచ్చాడు. కోహ్లీ మళ్లీ తన అకాడమీకి వచ్చి బేసిక్స్ నేర్చుకోవాలని సూచించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్ట్ సిరీస్లో విరాట్ మూడు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు. దాంతో అతని ఆటతీరుపై విమర్శలు ఎక్కువయ్యాయి. కొందరు అతని బ్యాటింగ్ టెక్నిక్పై దృష్టిపెట్టాలని సూచిస్తుండగా.. మరికొందరూ షాట్ సెలెక్షన్ కరెక్ట్ చేసుకోవాలన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఖేల్ నీతీ యూట్యూబ్ చానెల్ పోడ్కాస్ట్లో మాట్లాడిన రాజ్కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.'కోహ్లీ తన బేసిక్స్ను తిరిగి నేర్చుకోవాలి. అతను తిరిగి అకాడమికి రావాలని కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి ఈ విషయంపై ఆలోచిస్తున్నాను. త్వరలో కోహ్లీతో మాట్లాడుతాను. కోహ్లీకి అకాడమీలో ఉన్నప్పటి విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవాలి. కోహ్లీ బాగానే రాణిస్తున్నాడు కానీ, దురదృష్టవశాత్తు అతను అతి జాగ్రత్తగా ఆడుతున్నాడు. కెరీర్ ప్రారంభంలోలాగా స్వేచ్ఛగా ఆడితే త్వరలోనే ఉన్నత స్థానాన్ని తిరిగి చేరుకుంటాడు. ఇలాంటి వికెట్లపై పంత్, అయ్యర్లాగా దూకుడుగా ఆడాలి'అని రాజ్కుమార్ శర్మ అన్నాడు.
గత రెండున్నరేళ్లుగా కోహ్లీ సెంచరీ చేయలేకపోయాడు. అడపాదడపా హాఫ్ సెంచరీలు బాదినా.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. బ్యాటింగ్ వైఫల్యంతోనే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్.. మళ్లీ ఒకప్పటిలా ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే విరాట్ బ్యాటింగ్ టెక్నిక్లో ఎలాంటి సమస్యలేదని, గత కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోవడం అతని ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఒక్క సెంచరీ చేస్తే మళ్లీ మనం పాత కోహ్లీని చూడవచ్చని పేర్కొన్నాడు.
ఆటగాడిగా జట్టులో కొనసాగేందుకు విరాట్ కోహ్లీ అప్కమింగ్ ఐపీఎల్ కీలకం కానుంది. ఈ టోర్నీలో విరాట్ విఫలమైతే భారత జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ ఈ సారి కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు.