టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు ఎత్తకపోతే కొందరికి పూట గడవదని అతని సోదరుడు వికాస్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతను ఎవరి పేరును ప్రస్తావించకపోయినా.. కోహ్లీని విమర్శించే మాజీ ఆటగాళ్లను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ఇటీవల కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ థ్రెడ్స్లో వికాస్ కోహ్లీ ఓ పోస్ట్ పెట్టాడు. 'కొందరికి కోహ్లీ పేరు ఎత్తకపోతే పూట గడవదు అన్నట్లుగా ఉంది పరిస్థితి'అని హిందీలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. వికాస్ కోహ్లీ పోస్ట్తో కోహ్లీ ఫ్యాన్స్ ఏకీభవిస్తున్నారు. కొందరు మాజీ ఆటగాళ్లు పనిగట్టుకొని కోహ్లీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

ఇటీవల విరాట్ కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ సులువైన ఫార్మాట్ ఎంచుకున్నాడని చులకనగా మాట్లాడాడు. తన లోపాలను సరిదిద్దుకోకుండా టెస్ట్లకు వీడ్కోలు పలికాడని అభిప్రాయపడ్డాడు.
'జో రూట్ టెస్ట్ క్రికెట్లో కొత్త రికార్డులను అందుకుంటున్నాడు. నా మనసు మాత్రం కోహ్లీ వెంటే పరుగులు తీస్తోంది. చాలా ముందుగానే అతను టెస్ట్ల నుంచి తప్పుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఐదేళ్ల ముందు నుంచి ఫామ్లేమితో ఇబ్బందిపడ్డాడు. కానీ, ఈ ఐదేళ్లలో టెస్ట్ల్లో సగటు 31కి ఎందుకు పడిపోయిందని ఆలోచించలేదు.

లోపాలను సరిదిద్దుకొని మళ్లీ ఫామ్ అందుకునేందుకు మనసు పెట్టి ప్రయత్నించలేదు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ పొరపాట్లను సరిచేసుకొని టెస్ట్ క్రికెట్లో మరింత గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. కానీ కోహ్లీ ఇక చాలా అని వీడ్కోలు పలకడం నాకు బాధగా ఉంది.
విరాట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినా బాగుండేది. కానీ టాపార్డర్ బ్యాటర్కు ఎంతో సులువైన వన్డేల్లో కొనసాగడం నన్ను మరింత నిరాశకు గురి చేసింది'అని మంజ్రేకర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంజ్రేకర్పై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్తో కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు.