హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెటర్గా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా పదిహేను ఏళ్ల క్రితం ఇదే రోజు(2008 ఆగస్టు 18) శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కోహ్లీ.. అరంగేట్ర మ్యాచ్లో 12 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గాయపడటంతో ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో అతనిపై విమర్శల వర్షం కురిసింది. ఆ సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమైన అతను.. నాలుగో మ్యాచ్లో కీలక హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆ తర్వాత సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఆడుతూ జట్టులో కొనసాగాడు. 2009లో సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గాయం కారణంగా యువరాజ్ సింగ్ తప్పుకోవడంతో కోహ్లీకి తుది జట్టులో చోటు దక్కింది. ఆ మ్యాచ్లో గౌతమ్ గంభీర్తో కలిసి అసాధారణ బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు.
అతని ఆటకు ముగ్దుడైన గంభీర్.. ఈ మ్యాచ్లో తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లీకి అందజేశాడు. ఆ క్షణం నుంచి కోహ్లీకి తిరుగులేదు. మైదానంలో కాస్త దూకుడుగా ఉంటూ విమర్శలపాలైనా.. 2012 తర్వాత కొత్త కోహ్లీని తలపించాడు. పూర్తిగా ఫిట్నెస్పై ఫోకస్ పెట్టిన కోహ్లీ..భారత జట్టులో ఫిట్నెస్ విప్లవాన్ని తీసుకొచ్చాడు.
మైదానంలోపరుగుల మోత మోగిస్తూ అసాధారణమైన ఘనతలను అందుకున్నాడు. తన ఆటతో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2022 టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్కే హైలైట్. 2009 నుంచి రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీ ఒక్కసారి కూడా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొలేదు.
ముందు జాగ్రత్తల్లో భాగంగానే పలు మ్యాచ్లకు దూరమయ్యాడు తప్పా.. గాయాలతో ఒక్కసారి కూడా తప్పుకోలేదు. ఇప్పటి వరకు 111 టెస్ట్లు, 275 వన్డేలు, 115 టీ20లు ఆడిన కోహ్లీ..25582 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ల మధ్య అతను పరుగెత్తిన దూరం.. 276.7 కిలోమీటర్లు కావడం విశేషం. ప్రస్తుతం ఈ రికార్డు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.