
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు జోరు కొనసాగించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టాప్-2 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో బ్యాట్స్మెన్ విభాగంలో టాప్లో ఉన్న విరాట్ ఖాతాలో 871 రేటింగ్ పాయింట్లున్నాయి. రోహిత్ 855 పాయింట్లతో అతని తర్వాత ఉండగా.. పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్(829) థర్డ్ ర్యాంక్లో నిలిచాడు. బౌలర్ల లిస్ట్లో న్యూజిలాండ్ పేసర్ ట్రెండ్ బౌల్ట్(722) టాప్ ర్యాంక్లో ఉండగా.. బుమ్రా(719), అఫ్గానిస్థాన్ యువ ఆటగాడు ముజిబుర్ రెహ్మాన్(701) రెండు, మూడు ర్యాంకులు సాధించారు. ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా(8వ) ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
ఇక కరోనా కారణంగా ఐదు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా దూరంగా ఉండిపోగా.. వచ్చే ఏడాది జనవరి వరకూ భారత్ జట్టు మళ్లీ వన్డేలు ఆడే సూచనలు కనిపించడం లేదు. ఆస్ట్రేలియా గడ్డపై జనవరి 12 నుంచి 17 వరకూ కంగారూలతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా తలపడనుంది. గత మార్చి నుంచి వన్డేలకి భారత క్రికెటర్లు దూరంగా ఉన్నా.. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాల్ని దక్కించుకున్నారు.