ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణంగా విఫలమవ్వడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సిరీస్ పరాజయంపై బీసీసీఐ రివ్యూ చేస్తుందని, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను వివరణ కోరుతుందని ప్రచారం జరిగింది.
అంతేకాకుండా టీమిండియా వైఫల్యానికి కారణమైన సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సహాయక సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. కోహ్లీ, రోహిత్ ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కూడా ఆడుతారని సదరు అధికారి స్పష్టం చేశారు.

టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ చేస్తుందని, ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. 'టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ మీటింగ్ ఉంటుంది. అయితే.. ఎవరిపై చర్యలు ఉండవు. ఎవర్నీ జట్టులో నుంచి తీసేయరు. బ్యాటర్ల వైఫల్యానికి హెడ్ కోచ్ ఏం చేస్తాడు? గౌతమ్ గంభీరే కోచ్గా కొనసాగుతాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా జట్టులోనే కొనసాగుతారు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కూడా ఆడుతారు. ప్రస్తుతం టీమిండియా ఫోకస్ అంతా ఛాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది.'అని సదరు బీసీసీఐ అధికారి ఓ ఛానెల్కు తెలిపాడు.
పేలవ ఫామ్తో సతమతమవుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడుతారని తెలుస్తోంది. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. భారత్ మ్యాచ్లు తటస్థ వేదికైన దుబాయ్లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఇంగ్లండ్తో సిరీస్లకు, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన భారత జట్లను జనవరి 12న ప్రకటించే అవకాశం ఉంది. ఇక కోహ్లీ, రోహిత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.
కోహ్లీ 9 ఇన్నింగ్స్ల్లో ఒక సెంచరీ సాయంతో 190 పరుగులే చేయగా.. రోహిత్ శర్మ ఐదు ఇన్నింగ్స్ల్లో 31 పరుగులే చేశాడు. మరోవైపు గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్కు ఘోర పరాజయాలే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.