కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకే తాను లండన్కు షిఫ్ట్ అయ్యానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తండ్రిగా తన పిల్లలతో ఆడుకోవడాన్ని ఆస్వాదించానని చెప్పాడు. ఈ ఫేజ్ చాలా అద్భుతంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ అనంతరం యూకేకు వెళ్లి పోయిన విరాట్ కోహ్లీ.. గత కొన్ని నెలలుగా అక్కడే ఫ్యామిలీతో గడిపాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసమే గత వారం భారత్కు తిరిగి వచ్చాడు.
టీ20, టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. తన వ్యాపార వ్యవహారాలను కూడా పక్కనపెట్టి కుటుంబానికి తన సమయాన్ని కేటాయించాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డే ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్లతో కోహ్లీ చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే తాను అత్యధిక మ్యాచ్లు ఆడానని చెబుతూ..తన టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

'టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత నాకు చాలా సమయం దొరికింది. ఈ బ్రేక్ను నేను పూర్తిగా కుటుంబానికే కేటాయించాను. జీవితాన్ని మళ్లీ అందుకునే ప్రయత్నం చేస్తున్నాను. గత కొన్నేళ్లుగా నేను నా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. కుటుంబంతో గడిపితే ఇంత ఆనందం వస్తుందని కూడా నాకు తెలియదు. నా పిల్లలతో గడపడం చాలా సంతోషాన్నిచ్చింది. వారితో ఆడుకోవడం.. వారి ఎదుగుదలను దగ్గరి నుంచి చూడటం బాగుంది.
ఇది ఒక అందమైన దశ. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడటంతో చాలా ఫ్రెష్గా, ఫిట్గా ఉన్నట్లు అనిపిస్తోంది. నెట్స్లో, ఫీల్డింగ్ సెషన్లో చాలా చురుకుగా కదులుతున్నాను.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
గత 15 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో తానే అత్యధిక మ్యాచ్లు ఆడానని చెబుతూ.. కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. చిన్నప్పుడు కఠినమైన ఆస్ట్రేలియా కండిషన్స్లో సచిన్, సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ రాణించిన విధానం చూసి ఇక్కడ సత్తా చాటి, క్రికెటర్గా తాను ఏంటో నిరూపించుకోవాలనే కసి కలిగిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
'నా చిన్నతనంలో ఆస్ట్రేలియాలో జరిగే డే లైట్ మ్యాచ్లను ఉదయమే లేచి చూసేవాడిని. బంతి పిచ్ నుంచి దూసుకోపోవడం, ప్రత్యర్థుల కవ్వింపులను చూసినప్పుడు.. ఇలాంటి కండిషన్స్లో రాణించగలిగితే క్రికెటర్గా నేను సక్సెస్ అయినట్లేనని, గర్వించదగిన విషయం అవుతుందని భావించేవాడిని.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.