కుర్రాళ్లకు అవకాశాలు దక్కాలనే తాను అంతర్జాతీయా టీ20లకు వీడ్కోలు పలికానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2026కు సన్నదమయ్యేందుకు ఆటగాళ్లకు సమయం పడుతుందని, దాంతోనే టీ20 ప్రపంచకప్ 2024 గెలవగానే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించానని కోహ్లీ వెల్లడించాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నిలకడగా రాణిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. కోహ్లీ సూపర్ ఫామ్తో ఆర్సీబీ కూడా 7 విజయాలతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. తాజాగా ఆర్సీబీ పాడ్కాస్ట్లో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడంపై స్పందించాడు.
'అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత నాకు ఏది మారినట్టు అనిపించ లేదు. కొత్త ఆటగాళ్ల కోసమే టీ20లకు వీడ్కోలు పలికాను. ప్రస్తుతం భారత్ కోసం ఆడేందుకు కొత్త తరం ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు సమయం ఇవ్వాలి. వాళ్లు రెండేళ్ల పాటు క్రికెట్ సైకిల్లో ఆడాలి, ప్రయాణించాలి. ఒత్తిడిని ఎదుర్కోవాలి, వేర్వేరు దేశాల్లో ఆడాలి, విభిన్న పరిస్థితుల్లో మ్యాచ్లు ఆడాలి. అప్పుడే ప్రపంచకప్ వచ్చేసరికి వాళ్లు పూర్తిగా సిద్ధమవ్వగలరు.'అని కోహ్లీ వివరించాడు.

విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. టీమిండియా టీ20 జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్తో చాలా మంది కొత్త స్టార్లు వెలుగులోకి వచ్చారు. భారత జట్టు ఎంపిక సవాల్తో కూడుకున్న విషయమే.
ఐపీఎల్ టైటిల్ కంటే అభిమానుల ప్రేమనే ఎక్కువని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్లో కోహ్లీ గత 18 ఏళ్లుగా ఆర్సీబీకీ మాత్రమే ఆడుతున్నాడు."ఈ ఫ్రాంచైజీతో నాకు ఉన్న సంబంధం, పరస్పర గౌరవం వల్లే ఈ ఫ్రాంఛైజీతో కొనసాగుతున్నాను. అదే నాకు ఎంతో విలువైనవి. నాకు అభిమానుల నుంచి దక్కే ప్రేమను ఏ ట్రోఫీ కూడా సమం చేయలేదు. వాళ్ల ప్రేమ నాకు ఎంతో అమూల్యమైనది" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.