న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో ఓ బ్యాటర్ అసలు సిసలు సత్తా తెలుస్తుందని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. 50 ఓవర్ల ఫార్మాట్ బ్యాటర్ టెక్నిక్, కంపోజర్, ఓపికకు పరీక్షగా నిలుస్తుందన్నాడు. ఆసియాకప్ 2023 నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. బ్యాటర్ సత్తాకు పరీక్షగా నిలిచే వన్డే క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు.
ఈ వీడియోను తాజాగా స్టార్ స్పోర్ట్స్ అభిమానులతో పంచుకుంది. సవాళ్లను ఇష్టపడే తనకు వన్డే ఫార్మాట్.. తన బ్యాటింగ్లోని అన్ని అంశాలను పరీక్షించుకునే వెసులు బాటు కల్పిస్తుందని చెప్పాడు. 'వన్డే క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఫార్మాట్ ఆటగాడి సత్తాకు పరీక్షగా నిలుస్తోంది. ప్లేయర్ టెక్నిక్, కంపోజర్తో పాటు ఓపికను పరీక్షిస్తోంది. ఈ ఫార్మాట్లో పరిస్థితులకు తగ్గట్లు విభిన్న దశలో ఆడాల్సి ఉంటుంది.

కొన్నిసార్లు నిధానంగా ఆడాల్సి వస్తే.. మరికొన్నిసార్లు ధనాధన్ బ్యాటింగ్తో ధాటిగా ఆడాల్సి ఉంటుంది. ఈ ఫార్మాట్ ఎప్పుడూ నా అత్యుత్త ప్రదర్శనను వెలికితీస్తోంది. ఎందుకంటే నాకు సవాళ్లను స్వీకరించడం ఇష్టం. వన్డే ఫార్మాట్లో నేను ఎప్పుడూ పరిస్థితులకు తగ్గట్లు జట్టు విజయం కోసం ఆడేందుకు ప్రయత్నిస్తాను.
ఇది నా బ్యాటింగ్లోని అన్ని అంశాలను పరీక్షించుకునేలా చేస్తోంది. అందుకే నాకు వన్డే క్రికెట్ అంటే ఇష్టం.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ గెలవాలనే కోరిక అభిమానుల కంటే ఆటగాళ్లకే ఎక్కువగా ఉంటుందని కోహ్లీ తెలిపాడు. ప్రపంచకప్ గెలిచేందుకు ఆటగాళ్లంతా తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పిన కోహ్లీ.. మెగా టోర్నీ అంటే ఒత్తిడి ఉండటం సహజమన్నాడు.
'ప్రపంచకప్ అంటే ఒత్తిడి ఉండటం సహజం. ప్రపంచకప్ గెలవాలని ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకుంటారు. కానీ వాళ్ల కంటే ఎక్కువ ఆటగాళ్లకు విజయం సాధించాలని ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొవడం నాకు చాలా ఇష్టం. ఈ ప్రపంచకప్ నాకు బిగ్ చాలెంజ్. ఈ టోర్నీ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. నాకు నేను మరోస్థాయి చేరుకోవడానికి ఈ సవాల్ ఉపయోగపడుతోంది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్ 2023కి బుధవారం తెరలేవనుండగా.. తొలి మ్యాచ్లో పాకిస్థాన్-నేపాల్ జట్లు తలపడుతున్నాయి. సెప్టెంబర్ 2న జరిగే మ్యాచ్లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీ ముగిసిన అనంతరం అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది.