కోల్కతా: వికెట్ నెమ్మదిగా ఉండటంతోనే ఆచితూచి బ్యాటింగ్ చేశానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ(121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు.
వన్డే కెరీర్లో విరాట్ కోహ్లీకి ఇది 49వ సెంచరీ. దాంతో అతను అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన ఘనతను కోహ్లీ సమం చేశాడు. తన 35వ జన్మదినం సందర్భంగా దేవుడి రికార్డును సమం చేసి బర్త్డేను మరింత ప్రత్యేకంగా మలుచుకున్నాడు.

అంతర్జాతీయ వన్డేల్లో 452 ఇన్నింగ్స్ల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు బాదగా.. విరాట్ కోహ్లీ 277 ఇన్నింగ్స్ల్లోనే పూర్తి చేశాడు. తద్వారా వైట్ బాల్ క్రికెట్లో 50 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 49 సెంచరీలు బాదిన కింగ్.. టీ20ల్లో ఒక సెంచరీ నమోదు చేశాడు.
అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ జట్టు కోసం కాకుండా సెంచరీ కోసం ఆడాడని కొంత మంది అభిమానులు విమర్శలు గుప్పించారు. సెల్ఫీష్ అనే ట్యాగ్ను ట్రెండ్ చేశారు. సెంచరీ పూర్తి చేసుకోవడానికి 119 బంతులు ఆడాడని, ఒక్క సిక్స్ కొట్టలేదని విమర్శించారు. ఈ విమర్శలను విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తిప్పికొట్టారు.
ఇక ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. టీమ్మేనేజ్మెంట్ సూచనలతోనే స్లో బ్యాటింగ్ చేశానని స్పష్టం చేశాడు. 'పిచ్ బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉంది. చాలా స్లోగా ఉంది. రోహిత్, శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వారి శుభారంభాన్ని కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. పవర్ ప్లే అనంతరం బంతి బాగా టర్న్ అయ్యింది. స్పిన్నర్లను ఆడటం కష్టంగా అనిపించింది.
దాంతో చివరి వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నాను. జట్టులో ఓ సీనియర్ బ్యాటర్గా నా పాత్ర కూడా అదే. టీమ్మేనేజ్మెంట్ నుంచి కూడా నాకు అదే సందేశం అందింది. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దూకుడుగా ఆడి వేగంగా పరుగులు రాబట్టాడు. మూడు, నాలుగు స్థానాల్లో ఆడే బ్యాటర్లు రాణించడం జట్టుకు చాలా కీలకం.
హార్దిక్ పాండ్యా సేవలను కూడా కోల్పోయిన నేపథ్యంలో మిడిలార్డర్లో భాగస్వామ్యం నెలకొల్పడం చాలా కీలకం. మిడిలార్డర్లో ఒకటి, రెండు వికెట్లు పడితే జట్టు కష్టాల్లో పడుతోంది. జట్టు విజయంలో నా వంత పాత్ర పోషించే అవకాశం దక్కడం గొప్పగా ఫీలవుతున్నా. ప్రఖ్యాత వేదిక.. జనసందోహం ముందు నా బర్త్డే రోజు శతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ఆటగాడికైనా ఇది ఓ కల'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.