టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సమయం దొరికితే తెలుగు సినిమాలను చూస్తానని చెప్పిన కోహ్లీ.. తెలుగు సినిమా పాటలు తరుచుగా వింటానని చెప్పాడు. గతేడాది హైదరాబాద్లో జరిగిన ఓ ఈవెంట్కు హాజరైన విరాట్ కోహ్లీ.. ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాడు.
తాను ఎన్టీఆర్ నటనకు, వ్యక్తిత్వానికి ఎంతో ఫిదా అయ్యానని, ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడతారని ప్రశంసించాడు. గతంలో ఒక రోడ్డు సేఫ్టీ అవగాహనా కార్యక్రమంలో ఎన్టీఆర్ను కలిసానని, అప్పటి నుంచి తమ మధ్య స్నేహం కొనసాగుతుందని కూడా చెప్పుకొచ్చాడు.'RRR' సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడం గొప్ప విషయమని కూడా కోహ్లీ పేర్కొన్నాడు. తమిళంలో శింబు అంటే తనకు ఇష్టమని మరో కార్యక్రమంలో కోహ్లీ తెలిపాడు.

ఓ మ్యాచ్ సందర్భంగా 'నాటు నాటు' పాటకు విరాట్ కోహ్లీ స్టెప్పులు వేసాడు. అప్పట్లో ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. టీ20, వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే మూడు వన్డేల సిరీస్తో విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం లండన్లో ఉంటున్న కోహ్లీ.. ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్లో చివరిసారిగా ఆడిన కోహ్లీ.. పూర్తిగా కుటుంబానికే పరిమితమయ్యాడు. తన 18 ఏళ్ల కలను మాత్రం సాకారం చేసుకున్నాడు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం వార్-2 అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ దేశవ్యాప్తంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ కలెక్షన్లను అందుకోలేకపోయింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్గా చేశారనే ప్రచారం వార్2కు నెగిటివ్గా మారింది.