టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి అందర్నీ షాక్కు గురి చేశాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్.. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. 'నా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అంతర్జాతీయ క్రికెటర్గా నాకు ఇదే చివరి రోజు. ఆటగాడిగా నేను ఎన్నో మధుర జ్ఞాపకాలను సృష్టించాను. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో మాదే(రోహిత్తో) చివరి గ్రూప్. నేను చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి.

బీసీసీఐతో పాటు నా సహచర ఆటగాళ్లకు, కోచ్లకు స్పెషల్ థ్యాంక్స్. భారత అంతర్జాతీయ క్రికెటర్గా ఇదే నా చివరి రోజు. నేను క్లబ్ క్రికెట్ ఆడుతాను. భారత డ్రెస్సింగ్ రూమ్లో నేను చాలా సరదాగా ఉండేవాడిని. భారత్ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. భారత క్రికెట్లో నా భాగస్వామ్యం ఉండటం సంతోషంగా ఉంది. నా బౌలింగ్లో ఎక్కువ క్యాచ్లు పట్టిన పుజారా, రహానే, కోహ్లీ, రోహిత్ శర్మలకు స్పెషల్ థ్యాంక్స్ 'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
అశ్విన్ రిటైర్మెంట్తో వన్డే ప్రపంచకప్ 2021 గెలిచిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే మిగిలాడు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లలో అందరూ ఇప్పటికే భారత జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం కోహ్లీ ఒక్కడే మిగిలిపోయాడు. అతను కూడా రిటైర్మెంట్కు చేరువలోనే ఉన్నాడు.
ఇప్పటికే టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం 36 ఏళ్లే ఉన్న కోహ్లీ మరో నాలుగేళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది.