దేశవాళీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిద్దమయ్యాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. ఢిల్లీ తరఫున రైల్వేస్ జట్టుతో జరిగే మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. సౌరాష్ట్రతో జరిగిన గత మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ బరిలోకి దిగాల్సి ఉంది. కానీ మెడనొప్పి కారణంగా కోహ్లీ ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు.
టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కఠిన నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలనే రూల్ను తీసుకొచ్చింది. దాంతో స్టార్ ఆటగాళ్లంతా దేశవాళీ బరిలో నిలిచారు.

రంజీ ట్రోఫీ 2024-25 సెకండ్ ఫేజ్ తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు బరిలోకి దిగారు. కోహ్లీ సైతం ఆడేందుకు సన్నదమవుతున్నాడు. భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోహ్లీ రెడీ అవుతున్నాడు.
ముఖ్యంగా తన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీల బలహీనతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఐదు టెస్ట్లు..9 ఇన్నింగ్స్ల్లో 8 సార్లు కోహ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకే వెనుదిరిగాడు.
ఈ క్రమంలోనే ఆ బంతులను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై కోహ్లీ ఫోకస్ పెట్టాడు. సంజయ్ బంగర్ పర్యవేక్షణలో గంటల కొద్దీ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరఫున ఆడేందుకు సిద్దమైన కోహ్లీకి ఆ జట్టు సారథ్య బాధ్యతలు ఇచ్చేందుకు ఆ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సిద్దమైంది. కానీ కెప్టెన్సీకి కోహ్లీ నిరాకరించినట్లు తెలుస్తోంది.
గత మ్యాచ్కు ముందు రిషభ్ పంత్కు కూడా డీడీసీఏ కెప్టెన్సీ ఆఫర్ ఇవ్వగా.. అతను కూడా నిరాకరించాడు. జట్టులోని ఆటగాళ్లపై అవగాహన లేదని, టీమ్పై పట్టు లేదని పంత్ తెలిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కోహ్లీ కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. రంజీ ట్రోఫీలో ఢిల్లీ ఆయుష్ బదోని సారథ్యంలో ఆడుతోంది. గత మ్యాచ్లో పంత్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఢిల్లీ ఓటమిపాలైంది. కోహ్లీ రీఎంట్రీతోనైనా ఢిల్లీ విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.