
కేప్టౌన్: తప్పులను రిపీట్ చేయడానికి కనీసం 7-8 నెలల గ్యాప్ ఉండాలని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన సలహా తన కెరీర్కు ఎంతగానో ఉపయోగపడిందని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్ట్ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన విరాట్.. రిషభ్ పంత్ వైఫల్యంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో కీలక సమయంలో రిషభ్ పంత్ నిర్లక్ష్యపు షాట్తో వికెట్ సమర్పించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈ యువ వికెట్ కీపర్పై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే పంత్ వైఫల్యంపై స్పందించిన విరాట్.. క్రికెట్లో తప్పులు చేయడం సహజమని అతన్ని వెనకేసుకొచ్చాడు. రిషభ్ పంత్ తన తప్పిదాల నుంచి గుణ పాఠం నేర్చుకుంటాడని విరాట్ కోహ్లీ తెలిపాడు. 'రిషభ్ పంత్ తన తప్పులను సరిదిద్దుకుంటాడు. మేటి క్రికెటర్గా తనను తాను నిరూపించుకుంటాడు. ప్రాక్టీస్ సెషన్లో తనతో మేము ఇప్పటికే మాట్లాడాం. పరిస్థితుల తగ్గట్లు ఆడాలని చెప్పాం. అతను పరిణతి కలిగిన ఆటగాడు. కచ్చితంగా పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు.'' అని చెప్పిన కోహ్లీ.. మూడో టెస్టుకు పంత్ తుది జట్టులో ఉంటాడని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.
ఇక ఆటగాళ్ల తప్పిదాల కామన్ అని చెప్పిన కోహ్లీ.. తనకు ధోనీ ఇచ్చిన అడ్వైజ్ గుర్తు చేసుకున్నాడు. ' ఆటగాళ్ల తప్పిదాల గురించి మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీ నాతో ఒక మాట చెప్పాడు. తప్పిదాలను పునరావృతం చేసేటప్పుడు కనీసం 7-8 నెలల గ్యాప్ ఉండాలని సలహా ఇచ్చాడు. అప్పుడే సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగించగలమన్నాడు. ఈ సలహా నా కెరీర్కు ఎంతగానో ఉపయోగపడింది.'అని విరాట్ చెప్పుకొచ్చాడు.
జోహెన్నస్బర్గ్ వేదికగా జరిగిన సెకండ్ టెస్ట్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ వీరోచిత పోరాటంతో మ్యాచ్ను వారి వైపు తిప్పుకొన్నాడు. దీంతో భారత్ ఒత్తిడిలో పడిపోయింది. మూడో మ్యాచ్ జరగబోయే కేప్టౌన్లో టీమిండియాకు గొప్ప రికార్డేమీ లేదు. దీంతో గెలుపు కోసం కోహ్లీ సేన తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఈ మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.