
న్యూఢిల్లీ: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్ ఆరంభంలో రాహుల్ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మన్లా కనిపించలేదన్నాడు. తాజాగా ఆర్సీబీ పాడ్కాస్ట్లో మాట్లాడిన విరాట్.. కెరీర్ ఆరంభంలో కేఎల్ రాహుల్ ఆర్సీబీకి ఆడినా అతనితో అప్పట్లో అంతగా కనెక్ట్ కాలేకపోయానని చెప్పాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలోనే అతని సామర్థ్యం తెలిసిందని విరాట్ చెప్పుకొచ్చాడు. రాహుల్ 2013లో ఆర్సీబీ జట్టు తరఫునే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాతి రెండేళ్లు సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. తిరిగి 2016లో బెంగళూరు గూటికే చేరిన అతను ఆ సీజన్లో 397 పరుగులతో రాణించాడు.
ఈ క్రమంలోకే కేఎల్ రాహుల్ ఐపీఎల్ జర్నీ పట్ల విరాట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'కరణ్ నాయర్, మయాంక్ అగర్వాల్తో కలిసి రాహుల్ 2013లో బెంగళూరు జట్టులోనే ఆడాడు. అయితే, అప్పుడు అతను టీ20 బ్యాట్స్మన్లా అస్సలు కనిపించలేదు. ఇక అతను ఆర్సీబీ జట్టును వీడాక నేను పట్టించుకోలేదు. కానీ, ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాత్రం అదరగొడుతున్నాడనే విషయాలు తెలుసుకున్నా.
మా జట్టులో ఆడినప్పుడు యువకుడిలా ఉండేవాడు. మేం ఇద్దరం కలిసి ఎన్ని మ్యాచ్లు ఆడినా పెద్దగా కనెక్ట్ కాలేకపోయాం. ఇక 2014లో అతను ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రం చేసినప్పుడు మాత్రం బాగా ఆకట్టుకున్నాడు. ఆటపై దృష్టిసారించి ఎంతో మెరుగ్గా తిరిగొచ్చాడు. దీంతో కంగారూల గడ్డపై మంచి ప్రదర్శన చేశాడు. అప్పుడే అతని ఆత్మస్థైర్యం చూసి ముచ్చటేసింది.' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
గత రెండు సీజన్లు పంజాబ్ కింగ్స్ సారథిగా కొనసాగిన కేఎల్ రాహుల్.. మెగా వేలానికి ముందు ఆ జట్టును వీడి కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్తో జత కట్టాడు. ఆ జట్టు కెప్టెన్గా ఐపీఎల్ 2022 సీజన్లో బరిలోకి దిగనున్నాడు. కెప్టెన్గా జట్టుకు విజయాలందించలేకపోయినా.. వ్యక్తిగతంగా మాత్రం రాహుల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గత రెండు సీజన్లుగా టాప్ 5 బ్యాట్స్మన్లలో చోటు దక్కించుకున్నాడు.