టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్పై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుతమైన పోరాటంతో సిరాజ్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడని కొనియాడాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన సిరాజ్కు అభినందనలు చెప్పిన కోహ్లీ.. అతని ప్రదర్శన తనకు గర్వంగా ఉందని చెప్పాడు.
కెరీర్ ఆరంభంలోనే మహమ్మద్ సిరాజ్కు విరాట్ కోహ్లీనే అండగా నిలిచాడు. ఆర్సీబీ జట్టులో సుదీర్ఘ కాలం పాటు ఆడిన సిరాజ్ను కోహ్లీ వెన్ను తట్టి ప్రోత్సహించాడు. కోహ్లీ సారథ్యంలోనే టీమిండియా టెస్ట్ టీమ్లోకి ఎంట్రీ ఇచ్చిన సిరాజ్.. అతని అండతో అంచెలంచెలుగా ఎదిగాడు. సిరాజ్ విఫలమైనప్పుడు కోహ్లీ అతనికి అండగా నిలిచాడు. దాంతో సిరాజ్ స్టార్ పేసర్గా జట్టులో కీలకమయ్యాడు.

ఇంగ్లండ్తో ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్ట్లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 339/6 ఓవర్ నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 367 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్(5/104) ఐదు వికెట్లతో భారత్కు చిరస్మరణీయమైన వియాజయాన్నందించాడు. సిరాజ్తో పాటు ప్రసిధ్ కృష్ణ(4/126) నాలుగు వికెట్లు తీయగా ఆకాష్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్ను టీమిండియా 2-2తో సమం చేసుకుంది. ఆఖరి టెస్ట్లో సిరాజ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు.
ఈ సిరీస్లో ఐదు మ్యాచ్లకు ఐదు ఆడిన సిరాజ్..32.43 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ సిరీస్లో ఐదుకు ఐదు మ్యాచ్లు ఆడిన ఏకైక పేసర్ సిరాజ్. ఇంగ్లండ్ నుంచి క్రిస్ వోక్స్ ఐదు మ్యాచ్లు ఆడినా.. ఆఖరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోనే అతను గాయపడ్డాడు. ముఖ్యంగా ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దాంతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది.
సిరాజ్ ప్రదర్శనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విరాట్ కోహ్లీ.. అతన్ని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. 'టీమిండియాకు ఇది గొప్ప విజయం. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ అద్భుతమైన పోరాటం, మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఈ గెలుపు దక్కింది. జట్టు కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టిన సిరాజ్కి ప్రత్యేక అభినందనలు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది.'అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు 'నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు భయ్యా' అని సిరాజ్ బదులిచ్చాడు.