ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ఢిల్లీ విజయంతో ముగించింది. రైల్వేస్ జట్టుతో శనివారం ముగిసిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
స్టార్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ రూల్ తీసుకురావడంతో 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించడంతో కోహ్లీని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. అంతర్జాతీయ మ్యాచ్ తరహాలోనే మైదానం మొత్తం నిండిపోయింది. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ భారీ విజయం సాధించినా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ను చూడలేకపోయారు.

తొలి ఇన్నింగ్స్లో 15 బంతుల్లో 6 పరుగులే చేసి కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హిమాన్షు సంగ్వాన్ స్టన్నింగ్ ఇన్ స్వింగర్తో కోహ్లీని ఔట్ చేశాడు. కనీసం రెండో ఇన్నింగ్స్లోనైనా అతని బ్యాటింగ్ చూడాలని ఫ్యాన్స్ భావించారు. కానీ ఢిల్లీ బౌలర్లు ఆ అవకాశమే ఇవ్వలేదు. రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన రైల్వేస్ను 114 పరుగులకే ఆలౌటైంది. దాంతో రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం లేకుండానే ఢిల్లీ విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ తొలి ఇన్నింగ్స్లో 241 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోహ్లీ విఫలమైనా.. ఆయుష్ బదోని(99), సుమిత్ మాథుర్(86) రాణించారు. దాంతో ఢిల్లీకి 133 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో రైల్వేస్ 114 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.