ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్ను ఓటమితో ప్రారంభించిన ఆర్సీబీ.. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. మిగతా జట్లన్నీ తమ సొంతగడ్డపై విజయాలు సాధిస్తుంటే.. ఆర్సీబీ మాత్రం హోమ్ గ్రౌండ్లో పరాజయాల పరంపర కొనసాగిస్తోంది.
ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట్లో ఓడి.. పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో విఫలమైంది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన కనబర్చి భారీ ఓటమిని మూటగట్టుకుంది.

తీవ్ర నిరాశలో విరాట్ కోహ్లీ..
ఫీల్డింగ్లో సునాయస క్యాచ్లు నేలపాలు చేసిన ఆ జట్టు ఆటగాళ్లు.. బ్యాటింగ్లో పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ పరాజయం పట్ల ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన బాధను దాచుకోలేకపోయాడు. డ్రెస్సింగ్ రూమ్లో తాను కూర్చున్న కుర్చీని గట్టిగా గుద్దుతూ తన కోపాన్ని ప్రదర్శించాడు.
ఈ ఓటమి నేపథ్యంలో విరాట్ చాలా బాధకు గురయ్యాడు. చాలా సేపటి వరకు మౌనంగా కూర్చుండి పోయాడు. అతని రియాక్షన్స్కు సంబంధించిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వీటిని చూసిన ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
కోహ్లీ ఒంటరి పోరాటం..
లక్నోతో మ్యాచ్లో విఫలమైనా.. గత మూడు మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆర్సీబీలో అతను మినహా మరే ఆటగాడు కూడా కమిట్మెంట్తో ఆడటం లేదు. బౌలర్లు అయితే చాలా దారుణంగా విఫలమవుతున్నారు. హోమ్ గ్రౌండ్ పిచ్ను రీడ్ చేయలేకపోతున్నారు. సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయకుండా.. ఫుల్ టాస్, లూజ్ బాల్స్తో ధారళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు.
చెత్త ఫీల్డింగ్..
బౌలింగ్కు తోడు చెత్త ఫీల్డింగ్ జట్టు కష్టాలను రెట్టింపు చేస్తోంది. సునాయస క్యాచ్లను కూడా వదిలేయడం విజయవకాశాలను దెబ్బతీస్తోంది. లక్నోతో మ్యాచ్లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నికోలస్ పూరన్ ఇచ్చిన క్యాచ్ను అనూజ్ రావత్ వదిలేసాడు. ఈ అవకాశంతో అతను విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగి లక్నోకు భారీ స్కోర్ అందించాడు.
కొంపముంచుతున్న మ్యాక్సీ, గ్రీన్
బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ మినహా మరే బ్యాటర్ రాణించలేదు. డేంజరస్ గ్లేన్ మ్యాక్స్వెల్ నాలుగు మ్యాచ్ల్లో రెండుసార్లు డకౌటయ్యాడు. తొలి మ్యాచ్ మినహా ఫాఫ్ డుప్లెసిస్ కూడా రాణించింది లేదు.
ఫస్ట్ మ్యాచ్లో సంచలన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన అనూజ్ రావత్ కూడా పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. రూ. 17.50 కోట్లు పెట్టి ముంబై నుంచి తెచ్చుకున్న కామెరూన్ గ్రీన్.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లోనూ దారుణంగా విఫలమవుతున్నాడు.