
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ 2022లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి గొప్ప పురస్కారాలు అందించారని, యావత్ దేశం గర్విస్తుందని ట్వీట్ చేశాడు. జూలై 29 నుంచి ఆగష్టు 8 వరకు ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు.. మొత్తంగా ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో 61 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
రెజ్లింగ్లో 12, వెయిట్లిఫ్టింగ్లో 10, అథ్లెటిక్స్లో 8, బాక్సింగ్లో 7, టేబుల్ టెన్నిస్లో 7, బ్యాడ్మింటన్లో 6, జూడోలో 3, హాకీలో 2, లాన్ బౌల్స్లో 2, స్వ్కాష్లో 2, టీ20 క్రికెట్లో 1, పారా పవర్లిఫ్టింగ్లో 1 మెడల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రీడా బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా కోహ్లి.. మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించాడు.

'మన దేశానికి గొప్ప పురస్కారాలు అందించారు. కామన్వెల్త్ గేమ్స్-2022లో పాల్గొన్న, గెలిచిన వాళ్లందరికీ శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం. జై హింద్'అంటూ కోహ్లీ పతకధారుల ఫొటోను షేర్ చేశాడు. ఇక ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో విరాట్ కోహ్లీ తిరిగి భారత జట్టులో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగా ఉన్న ఈ స్టార్ బ్యాటర్.. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్కు ఎంపికైన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా సెంచరీ చేయలేకపోయిన కోహ్లి.. ఈ టోర్నీలోనైనా విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు.