భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ను విరాట్ కోహ్లీ మైదానం నుంచి బటయకు నెట్టేసాడు. ఇక బ్యాటింగ్ చేసినకాడికి చాలు పోరా అయ్యా అంటూ బౌండరీ లైన్ బయటకు నెట్టేస్తూ సెండాఫ్ ఇచ్చాడు. కోహ్లీ మాటలకు డారిల్ మిచెల్ నవ్వుతూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ మ్యాచ్లో డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137)మరో శతకంతో చెలరేగాడు. తన నిలకడను కొనసాగిస్తూ వరుసగా రెండో సెంచరీ బాదాడు. ఈ సిరీస్లో వరుసగా మూడో మ్యాచ్లోనూ 50 ప్లస్ స్కోర్ నమోదు చేశాడు. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును డారిల్ మిచెల్.. విల్ యంగ్(30), గ్లేన్ ఫిలిప్స్(106)తో ఆదుకున్నాడు. 56 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన మిచెల్.. 106 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు.
విల్ యంగ్తో 53 పరుగులు, ఫిలిప్స్తో 219 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అతన్ని సిరాజ్ క్యాచ్ ఔట్ చేశాడు. అభిమానులకు అభివాదం చేస్తూ పెవిలియన్ వైపు నడిచిన మిచెల్ను కోహ్లీ అభినందించాడు. ఆ తర్వాత ఇక చాలు పోరా అయ్యా అంటూ మెడపట్టి నెట్టేసాడు. మిచెల్ నవ్వుతూ బౌండరీ లైన్ ధాటాడు. సిరాజ్ వేసిన 45వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137), గ్లేన్ ఫిలిప్స్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 106) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/63), హర్షిత్ రాణా(3/84) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/43), కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ శతకానికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి(57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 53), హర్షిత్ రాణా(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాక్ ఫోక్స్(3/77), క్రిస్టియన్ క్లార్క్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. జైడెన్ లెన్నాక్స్(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ జెమీసన్ ఒక వికెట్ తీసాడు.