17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ల వివరాలను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. మూడు ఫార్మాట్లలో తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ల పేర్లను తెలిపాడు. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్, వన్డేల్లో శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, టీ20ల్లో సునీల్ నరైన్ తాను ఎదుర్కొన్న కఠిన బౌలర్లని చెప్పాడు.
ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీని తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు ఎవరిని ప్రశ్నించగా నలుగురు పేర్లను చెప్పాడు.

మూడు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ తన ఆధిపత్యం కొనసాగించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. కేవలం టెస్ట్, వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ.. 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం.
కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో ఆర్సీబీ దుమ్మురేపుతోంది. 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్కు విజయం దూరంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్తో మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుంది.