
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తనకు మాత్రం రెండే రెండు మ్యాచ్లు ఫేవరేట్ అని తెలిపాడు. తన అద్భుత బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న ఈ పరుగుల యంత్రం.. శ్రీలంకతో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్, ఆస్ట్రేలియాతో ఆడిన 2016 టీ20 వరల్డ్కప్ క్వార్టర్ ఫైనల్ మరిచిపోలేని మధురానుభూతులు మిగిల్చిన మ్యాచ్లని పేర్కొన్నాడు.
9 ఏళ్ల కింద క్లిష్ట స్థితిలో జట్టుకు అండగా బాధ్యతాయుతంగా ఆడిన మ్యాచ్ ఒకటైతే.. దూకుడిగా ఆడి జట్టును సెమీస్ చేర్చిన మ్యాచ్ మరొకటి.
మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని 2011 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో స్వల్ప స్కోర్లకే ఓపెనర్లు సచిన్-సెహ్వాగ్ వికెట్ కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ను సీనియర్ క్రికెటర్ గంభీర్కు అండగా నిలిచి 83 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించాడు. 35 పరుగులు చేసి విజయానికి బాటలు వేశాడు.
ఇక 2016లో ఆసీస్తో మొహాలీలో మార్చి 27వ తేదీన జరిగిన మ్యాచ్లో కోహ్లీ అజేయంగా 82 పరుగులు సాధించాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో విరాట్ వీరవిహారం చేసి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. భారత్ 14 ఓవర్లు ముగిసే సమయానికి రోహిత్ శర్మ (12), శిఖర్ ధావన్ (13), సురేశ్ రైనా (10), యువరాజ్ సింగ్ (21) వికెట్లు చేజార్చుకుని 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లీ చెలరేగి ఆడాడు.
ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో తన బ్యాటింగ్ పవర్ చూపించి ఆసీస్కు చుక్కలు చూపించాడు. దాంతో భారత్ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. కాగా, ఖాళీ మైదానాల్లో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణపై కోహ్లీ మాట్లాడుతూ.. ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించవచ్చన్నాడు. కానీ ఆటలో మ్యాజిక్ మిస్ అవుతుందన్నాడు. ప్రేక్షకుల సందడి లేకుండా మ్యాచ్ల్లో మజా ఉండదన్నాడు. కానీ పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఎవ్వరం ఏం చేయలేమని తెలిపాడు.