ఈ తరం అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీనేనని మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. వరుస శతకాలతో ఇటీవల సూపర్ ఫామ్లో ఉన్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో జోరూట్ వరుసగా సెంచరీలు నమోదు చేశాడు.
దాంతో జోరూట్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్ అంటూ ఆ దేశ మాజీ ఆటగాళ్లు అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన ఆల్టైమ్ టెస్ట్ రికార్డ్స్ను జో రూట్ అధిగమిస్తాడని జోస్యం చెప్పారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే సచిన్ టెస్ట్ సెంచరీల రికార్డ్ను జో రూట్ మాత్రమే అధిగమిస్తాడని తెలిపాడు.

కోహ్లీనే బెస్ట్ బ్యాటర్..
తాజాగా ఇదే అంశంపై దినేశ్ కార్తీక్ మాట్లాడాడు. తన దృష్టిలో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్ అని చెప్పుకొచ్చాడు. ఫార్మాట్లతో సంబంధం లేకుండా అతను అత్యుత్తమంగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. ఇటీవలే జో రూట్ నిలకడగా ఆడుతున్నాడని, కానీ కోహ్లీ ఎప్పటి నుంచో పరుగుల వరద పారిస్తున్నాడని గుర్తు చేశాడు.
'ప్రస్తుత గణంకాల ప్రకారం అందరూ జో రూట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మాములు విషయమే. అయితే విరాట్ కోహ్లీని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను జోరూట్ను అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్గా చెప్పలేను. నా దృష్టిలో విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాటర్. జో రూట్ ఇటీవల కాలంలోనే టెస్ట్ల్లోనే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం చాలా రోజుల నుంచి మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతున్నాడు.'అని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
జోరూట్ 34.. కోహ్లీ 29 శతకాలు..
ప్రస్తుతం జో రూట్ 34 టెస్ట్ సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లీ 29 శతకాలే నమోదు చేశాడు. టెస్ట్ల్లో 51 సెంచరీలు చేసిన సచిన్.. 15,921 రన్స్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ నెలకొల్పిన ఈ ఆల్టైమ్ రికార్డ్స్ను అధిగమించాలంటే జో రూట్ మరో 18 శతకాలతో పాటు 3,544 పరుగులు చేయాలి. 33 ఏళ్ల వయసున్న జో రూట్ మరో నాలుగేళ్ల పాటు ఇదే ఫామ్ కనబరిస్తే.. సునాయసంగా ఈ రికార్డ్స్ను అధిగమిస్తాడు.
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరంటే..?
టీమిండియా భవిష్యత్తు సారథులుగా రిషభ్ పంత్, శుభ్మన్ గిల్ నిలిచే అవకాశం ఉందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.
దాంతో భవిష్యత్తు సారథి ఎవరా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే దినేశ్ కార్తీ.. పంత్, శుభ్మన్ గిల్ పేర్లను సూచించాడు. 'భవిష్యత్తులో భారత్ను మూడు ఫార్మాట్లలో నడిపించగల సత్తా రిషభ్ పంత్, శుభ్మన్ గిల్కు ఉంది. ఈ ఇద్దరూ ఇప్పటికే ఐపీఎల్లో తమ ఫ్రాంచైజీలకు సారథులుగా వ్యవహరిస్తున్నారు.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.