టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. గేమ్ పట్ల ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని తెలిపాడు. ఓ సీనియర్ బ్యాటర్గా ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా.. రోహిత్ శర్మతో ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుతానని చెప్పాడు.
అలాగే రోహిత్ శర్మ సైతం ఏ విషయం గురించి అయినా తనతో చర్చిస్తాడని పేర్కొన్నాడు. తమ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ.. రెండు టెస్ట్ల సిరీస్తో మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్లంతా ఈ సిరీస్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు.

మంగళవారం సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మతో ఉన్న సాన్నిహిత్యం గురించి స్పందించాడు. జట్టులో మంచి వాతావరణం ఉందని పేర్కొన్నాడు.
'డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. జట్టులో ఉన్న స్నేహ పూర్వక వాతావరణం కారణంగా మేమంతా ఆడేందుకు ఉత్సహంగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ ఆటగాడికైనా జట్టు కోసం ఎదైనా సాధించాలనే తపన ఉంటుంది. రోహిత్ శర్మతో నా బంధం బాగుంది. ఆట పట్ల మా అవగాహన, లక్ష్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
ఎప్పుడు భారత్ను గెలిపించాలనే అనుకుంటాం. జట్టులో ఉన్న లూప్ హోల్స్ను మేం కవర్ చేస్తాం. మ్యాచ్ ప్రణాళికల గురించి కలిసి చర్చిస్తాం. నేను ఏమైనా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే మొహమాటం లేకుండా రోహిత్తో చర్చిస్తాను. అతను కూడా నాతో మాట్లాడేందుకు.. నా సలహాలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడడు.
ప్రస్తుతం మా ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఇద్దరం మా ప్రధాన లక్ష్యం వైపు పయనిస్తున్నాం. మేమే కాదు జట్టు మొత్తం ఇలానే ఉంది. మంచి జోష్లో కనిపిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లోని ప్రతీ ఒక్కరు ప్రశాంతంగా కనిపించడంతో పాటు ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయడమనేది కీలకం. ఇద్దరం జట్టుకు కావాల్సిన విజయాల కోసం ప్రయత్నిస్తాం'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్న సమయంలో రోహిత్ శర్మతో బేధాభిప్రాయాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఐపీఎల్ సమయంలో ఈ ఇద్దరూ ఎడ మొహం, పెడ మొహంగా పెట్టడంతో ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ ఇద్దరి మధ్య విభేదాలను తొలగించడంతో మళ్లీ మునపటిలా ఫ్రెండ్స్ అయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి.