
సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ:
ఈ వన్డే సిరీస్ ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. వన్డేల్లో స్వదేశంలో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో మందున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును కోహ్లీ ఈ సిరీస్ ద్వారా అధిగమించే అవకాశం ఉంది. సొంతగడ్డపై సచిన్ 164 మ్యాచ్లలో 20 సెంచరీలు సాధించగా.. విరాట్ ఇప్పటివరకు 95 మ్యాచ్లలో 19 శతకాలు సాధించాడు. ఇక టీ20 సిరీస్తో ఫుల్ఫాంలోకి వచ్చిన కోహ్లీ.. అదే జోరు కొనసాగిస్తే సచిన్ రికార్డు బద్దలవడం ఖాయం.

స్వదేశంలో వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్లు:
సచిన్ టెండూల్కర్ (భారత్)- 20 (164 మ్యాచ్లు)
విరాట్ కోహ్లీ (భారత్)- 19 (95 మ్యాచ్లు)
హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 14 (69 మ్యాచ్లు)
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 13 (153 మ్యాచ్లు)
రాస్ టేలర్ (న్యూజిలాండ్)- 12 (106 మ్యాచ్లు)

మరో సెంచరీ చేస్తే:
ఈ వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్గా చరిత్రకెక్కనున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ ముందున్నాడు. పాంటింగ్ 41 సెంచరీలు (324 మ్యాచ్లు) చేశాడు. ప్రస్తుతం కోహ్లీ కూడా 41 సెంచరీలతో (197 మ్యాచ్లు) పాంటింగ్తో సమానంగా నిలిచాడు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్ 33 (286 మ్యాచ్లు), స్టీవ్ స్మిత్ 20 (93 మ్యాచ్లు), మైఖేల్ క్లార్క్ 19 (139 మ్యాచ్లు)లు వరుసగా ఉన్నారు.

ఇప్పటివరకు 100 మ్యాచ్లు:
భారత్-ఇంగ్లండ్ ఇప్పటివరకు 100 వన్డేల్లో ముఖాముఖి తలపడ్డాయి. వీటిలో 53 టీమిండియా గెలవగా.. ఇంగ్లిష్ జట్టు 42 మ్యాచ్లలో విజయం సాధించింది. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన గత ఐదు ద్వైపాక్షిక సిరీస్లను భారత్ కైవసం చేసుకుంది. కాగా 1984లో ఇంగ్లండ్ చేతిలో 5-1 తేడాతో ఓటమి తర్వాత ఇంతవరకు భారత జట్టుకు అలాంటి పరాభవం ఎదురుకాలేదు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications












