మొహాలి: టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడని బ్రిటీష్ మీడియా చేసిన ఆరోపణలను టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కొట్టిపడేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన కుంబ్లే ఇలాంటి గాలి వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదని తెలిపాడు.
'మీడియాలో వచ్చిన వార్తపై నేను స్పందించాలనుకోవడం లేదు. అసలు ఈ విషయంలో మాట్లాడేందుకు అంపైర్, రిఫరీ ఎవరూ మా దగ్గరికి రాలేదు. అందుకే ఇలాంటి కథనాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు. కొందరు వారేమనుకుంటున్నారో అదే మీడియాలో రాస్తారు. నాకు సంబంధించిన వరకు మా ఆటగాళ్లెవరూ అలాంటి చర్యలకు పాల్పడలేదు' అని కుంబ్లే స్పష్టం చేశారు.
అసలు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదని కుంబ్లే పేర్కొన్నాడు. కాగా, రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ బాల్ టాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ బ్రిటిష్ దిన పత్రిక 'ది డెయిలీ మెయిల్' మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.

తన నోట్లో ఉన్న తెల్లటి పదార్థాన్ని తీసి బంతికి అద్దుతూ దానికి మెరుపు తెచ్చేందుకు కోహ్లీ ప్రయత్నించాడని అందుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అందులో కోహ్లీ కుడి చేతిని నోట్లో పెట్టుకోవడం, దాంతో బంతిని రుద్దుతుండగా టీవీ కెమెరాలు బంధించాయి.
ట్యాంపరింగ్: కోహ్లికి మద్దతు, బ్రిటీష్ మీడియాపై సెహ్వాగ్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి పాలైన తర్వాత బ్రిటన్ పత్రిక ఈ కథనం రాయడంపై పలువురు మాజీలు మండిపడుతున్నారు. కోహ్లీపై బ్రిటిష్ మీడియా కావాలనే ఆరోపణలు చేస్తోందన్న విమర్శలు గుప్పించారు. కాగా, ఆసీస్తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడటంతో ఐసీసీ అతడికి మ్యాచ్లో వంద శాతం జరిమానా విధించిన సంగతి తెలిసిందే.