టీమిండియా హెడ్ కోచ్గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియామకం విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సంప్రదించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలతో మాత్రమే కొత్త కోచ్ ఎంపిక గురించి చర్చించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.
టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియడంతో కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్ గంభీర్ నియామకం వెనుక విరాట్ కోహ్లీ పాత్ర ఉంటుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగింది. గతంలో ఈ ఇద్దరూ మైదానం వేదికగానే గొడవపడ్డారు.

అయితే ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా ఒకరినొకరు హగ్ చేసుకొని తమ పాత గొడవలకు ఫుల్స్టాప్ పెట్టారు. ఈ క్రమంలోనే గంభీర్ నియామకానికి ముందు సీనియర్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ.. ఈ నియామకం విషయంలో విరాట్ కోహ్లీని విస్మరించినట్లు తెలుస్తోంది.
కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాల అభిప్రాయాలను మాత్రమే తీసుకుందని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. టీ20 ఫార్మాట్కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దూరం కాగా.. హార్దిక్ పాండ్యా సారథిగా కొనసాగనున్నాడు. గతేడాది నుంచే అతను టీ20ల్లో టీమిండియాను నడిపించాడు. 2027 వరకు గంభీర్ హెడ్ కోచ్గా కొనసాగనున్నాడు.
అతని పర్యవేక్షణలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచకప్ 2026, వన్డే ప్రపంచకప్ 2027, డబ్ల్యూటీసీ 2025 ఫైనల్, డబ్ల్యూటీసీ 2025-27 ఫైనల్ ఆడనుంది. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ 2027 ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగే అవకాశం ఉంది. కానీ గంభీర్ హెడ్ కోచ్గా సీనియర్లకు అవకాశం ఇస్తాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
జట్టులోని ఆటగాళ్లందరూ సమానమేనని చెప్పే గంభీర్.. సీనియర్లతో ఎలా వ్యవహరిస్తాడనేది కూడా సందేహంగా మారింది. ముక్కుసూటి మనిషి అయిన గంభీర్తో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.