హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని సోషల్ మీడియా ఖాతాల్లోని ఫాలోవర్ల సంఖ్యను చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. కేవలం భారత్లోనే కాకుండా విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. శతృదేశం పాకిస్థాన్లోనూ కోహ్లీ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు.
క్రికెట్ ఆడే దేశాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కోహ్లీని అభిమానించే వారున్నారు. అతని ఫిట్నెస్తో పాటు బాలీవుడ్ హీరోను తలపించే లుక్కు ఫ్యాన్స్ ఉన్నారు. మైదానంలో పరుగుల రారాజుగా ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే విరాట్ కోహ్లీ సంపాదనలోనూ అదరగొడుతున్నాడు.

తాజాగా విరాట్ కోహ్లీ సంపాదనకు సంబందించిన వివరాలను ఓ మ్యాగ్జైన్ తన కవర్ పేజీమీద ప్రచురించింది. ఈ మ్యాగ్జైన్ లెక్కల ప్రకారం విరాట్ కోహ్లీ నికర ఆదాయం(నెట్వర్త్) రూ.1050 కోట్లుగా ఉంది. దేశంలోనే అత్యంత రిచెస్ట్ సెలెబ్రిటీగా కోహ్లీ నిలిచాడని ఆ మ్యాగ్జైన్ పేర్కొంది.
విరాట్ కోహ్లీ సంపాదనలో ప్రధాన భాగం తన సొంత వ్యాపార పెట్టుబడులు, ప్రచారకర్తగా చేసుకున్న ఒప్పందాల నుంచే వస్తోంది.
ఇన్స్టాగ్రామ్లో ఒక్క వ్యాపార ప్రకటనను షేర్ చేసేందుకు విరాట్ కోహ్లీ రూ.8.9 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. ట్విటర్లో రూ. 2.5 కోట్లు తీసుకుంటున్నాడు. కోహ్లీ ప్రాపర్టీస్ విలువు రూ.110 కోట్లుగా ఉండగా.. కార్స్ విలువ రూ.31 కోట్లు ఉంది. ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇల్లు, గుర్గామ్లో రూ.80 కోట్ల ఇల్లు ఉంది. ఆడి, ఫార్చూనర్, రేంజ్ రోవర్ కార్లున్నాయి.
క్రికెట్పరంగా.. బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్న విరాట్ కోహ్లీ.. మ్యాచ్ ఫీజుల రూపంలో ఒక్క టెస్ట్ మ్యాచ్కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్కు రూ.3 లక్షలు తీసుకుంటున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ నుంచి 15 కోట్ల వార్షిక వేతనం తీసుకుంటున్నాడు. ఎమ్పీఎల్, డిజిట్, కాన్వో, యూనివర్సల్ స్పోర్ట్స్బిజ్, బ్లూట్రైబ్ వంటి కంపెనీల్లో విరాట్ కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు.
వ్యాపార ప్రకటనల ద్వారా రోజు రూ.7.5 నుంచి 10 కోట్లు వసూలు చేస్తున్నాడు. వివో, మింత్రా, గ్రేట్ లర్నింగ్, నాయిస్, వ్రాగన్, బ్లూస్టార్, టూయమ్మీ, ఓలిని, లక్సర్, హెచ్ఎస్బీసీ, ఊబర్, టూత్సీ, స్టార్ స్పోర్ట్స్, అమెరికన్ టూరిస్టర్, ఎమ్ఆర్ఎప్, సింథాల్ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.
కోహ్లీకి రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఫుట్బాల్ క్లబ్, టెన్నిస్ టీమ్, ప్రో రెజ్లింగ్ లీగ్ల్లో కూడా కోహ్లీ భాగస్వామిగా ఉన్నాడు.
తన సతీమణి అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ 'SeVVA'అనే ఎన్జీవోను కూడా నడిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ పేరిట పేద విద్యార్థులు, క్రికెటర్లకు స్కాలర్షిప్ అందజేస్తున్నాడు.