టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు అభిమానులు చెట్లెక్కారు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. బుధవారం బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సెలెన్స్ మైదానం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు. తన ఫామ్ను కొనసాగిస్తూ శతకంతో చెలరేగాడు.
101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 131 పరుగులు చేసాడు. గత ఐదు వన్డే మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీకి ఇది మూడో శతకం కావడం గమనార్హం. లిస్ట్-ఏ క్రికెట్లో విరాట్ కోహ్లీ 330 ఇన్నింగ్స్ల్లో 58 శతకాలు నమోదు చేశాడు. సచిన్ 60 సెంచరీల రికార్డ్కు రెండు శతకాల దూరంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ శతకంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ నయా రూల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్కు కర్ణాటక ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు మృతి చెందడంతో ప్రేక్షకుల సమక్షంలో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది.
కనీసం 2-3వేల మంది ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ నిర్వహించేందుకు అనుమతివ్వాలని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం తిరస్కరించింది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో విరాట్ కోహ్లీని చూసేందుకు భారీగా అభిమానులు తరలి వస్తారని, భద్రత కల్పించలేమని స్పష్టం చేస్తూ అనుమతికి నిరాకరించింది. దాంతో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ నిర్వహించారు.
ఈ మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించలేదు. ఈ మ్యాచ్కు ప్రత్యక్ష ప్రసారం కూడా లేదు. దాంతో విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు అభిమానులు.. ఈ స్టేడియం సమీపంలో ఉన్న చెట్లను ఎక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. చెట్లెక్కిన అభిమానం అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.