
న్యూఢిల్లీ: తనదైన ఆటతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆర్జనలోనూ దుమ్ములేపుతున్నాడు. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లోనూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. అత్యధిక ఇన్స్టా ఫాలోయర్లు కలిగిన క్రికెటర్గా రికార్డు సృష్టించిన కోహ్లీ.. ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఆర్జిస్తున్న వారిలో టాప్-20లో నిలిచాడు. ఇన్స్టాలో ఒక ప్రమోషనల్ పోస్టుకు అతను రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
హాపర్హెచ్క్యూ 2021 అనే సంస్థ ఈ మధ్యే 'ఇన్స్టాగ్రామ్ రిచ్లిస్ట్' పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కువగా ఆర్జిస్తున్న ప్రముఖుల పేర్లను వెల్లడించింది.
ఇందులో పుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డొ అగ్రస్థానంలో నిలిచాడు. ఇన్స్టాలో తాను చేసే ఒక్కో ప్రమోషనల్ పోస్ట్కు మార్కెటింగ్ ఏజెన్సీల నుంచి రూ.11.92 కోట్లు అందుకుంటున్నాడు.
డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్, హాలీవుడ్ సూపర్స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. భారత కరెన్సీ ప్రకారం వీరిద్దరూ ఒక్కో పోస్టుకు రూ.11.92 కోట్లు తీసుకుంటున్నారు. పాప్ సింగర్ అరియానా గ్రాండె మూడో స్థానంలో నిలిచింది.
'ఇన్స్టాగ్రామ్ రిచ్లిస్ట్'లో టాప్-20లో నమోదైన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే. అతను 19వ స్థానంలో నిలిచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయ వ్యక్తి ప్రియాంక చోప్రా. 27వ స్థానంలో నిలిచిన ఆమె ఒక పోస్టుకు రూ.3 కోట్ల వరకు తీసుకుంటుందని తెలిసింది.
ఫుట్బాల్ స్టార్లే ఎక్కువగా ఆర్జిస్తున్నారని ఈ జాబితా ద్వారా అర్థమవుతోంది. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ రూ.8.6 కోట్లు, బ్రెజిల్ స్టార్ నెయ్మార్ రూ 6.1 కోట్లు తీసుకుంటున్నారు. మొత్తం 395 మందితో రూపొందించిన ఈ జాబితాలో టీమిండియా నుంచి మరే క్రికెటర్కు చోటు దక్కలేదు. ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్, డేల్ స్టెయిన్కు చోటు దొరకడం గమనార్హం.