విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం రైల్వేస్తో ఢిల్లీ ఆడనున్న మ్యాచ్కు విరాట్ కోహ్లీ దూరమైనట్లు తెలుస్తోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడాల్సింది. ఈ వార్తలను ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా ధ్రువీకరించింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ.. విజయ్ హజారే ట్రోఫీ ఐదో రౌండ్ మ్యాచ్కు విరాట్ కోహ్లీ అందుబాటులో లేడని ఓ వార్త సంస్థ పేర్కొంది.
ఈ టోర్నీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగిన కోహ్లీ.. అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆంధ్రపై(131) సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. గుజరాత్పై హాఫ్ సెంచరీ(77) రాణించాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు లేని సమయంలో భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ నయా రూల్తో 15 ఏళ్ల తర్వాత కోహ్లీ ఈ టోర్నీ ఆడాడు. టెస్ట్, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. మూడో వన్డేలో అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీ(135, 102, 65 నాటౌట్) సత్తా చాటాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ.. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్లో బరిలోకి దిగనున్నాడు.
ఈ సిరీస్కు సన్నాహకంగానే అతను విజయ్ హజారే ట్రోఫీ ఐదో రౌండ్ మ్యాచ్ ఆడాలనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో కోహ్లీ ఈ మ్యాచ్కు దూరమవడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీలో ఉన్న ఢిల్లీ 5 మ్యాచ్ల్లో 4 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ఆ జట్టు క్వార్టర్స్కు చేరుతుంది.