విరాట్ కోహ్లీ అలుపెరుగని కృషికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ గెలిచిన విరాట్ కోహ్లీ.. కెరీర్లో వెలితిగా ఉన్న ఐపీఎల్ టైటిల్ కూడా వచ్చి వడిలో చేరింది. 18వ నెంబర్ జెర్సీ వేసుకునే కోహ్లీ.. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ అందుకోవడం గమనార్హం. ఈ ఐపీఎల్ టైటిల్ వెనుక విరాట్ కోహ్లీ 17 ఏళ్ల శ్రమ దాగి ఉంది. ఎన్నో విమర్శలు.. మరెన్నో అవమనాలు ఉన్నాయి. కానీ కోహ్లీ ఏనాడు ఆశ కోల్పోలేదు. ప్రతీ ఏడాది 18 ఏళ్ల కుర్రాడిలా తిరుగులేని శక్తితో గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. తన శక్తిని ధారపోసి మ్యాచ్లు గెలిపించాడు.
ఆర్సీబీ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే ఆర్సీబీగా మార్చేసుకున్నాడు. ఆర్సీబీ విజయాన్ని దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుందంటే దానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. కోహ్లీ కోసమే యావత్ దేశం ఆర్సీబీ టైటిల్ గెలవాలని కోరుకుంది. క్రిస్ గేల్, డివిలియర్స్ లాంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు ఈ ఫ్రాంచైజీకి ఆడారు. వాళ్ల ఆటతో విజయాలు అందించడంతో పాటు ఫైనల్కు చేర్చారు. కానీ తుది పోరులో విజయం సాధించలేక టైటిల్ను చేజార్చుకున్నారు.

ఇప్పుడు ఆ తప్పిదాన్ని ఆర్సీబీ చేయలేదు. కోహ్లీ సాయంతో విజయాన్నందుకుంది. ఫైనల్లో పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఓ ఎండ్లో ఆచితూచి ఆడిన కోహ్లీ.. మిగతా బ్యాటర్లను దూకుడుగా ఆడేలా ప్రోత్సహించాడు. దాంతో ఆర్సీబీ పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో విజయాన్నందుకుంది. కీలక ఫైనల్లో కోహ్లీ ఔటై ఉంటే ఫలితం మరోలా ఉండేది. అయితే ఈ సీజన్లో కోహ్లీ ఒక్కడిపైనే ఆర్సీబీ ఆధారపడలేదు.
ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, టీమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓవరాల్గా ఈ తరం ఐకాన్గా చేయగలిగినదంతా చేసిన విరాట్ కోహ్లీ.. కప్ గెలవగానే చిన్నపిల్లాడిలా కన్నీళ్ల పర్యంతంతో మైదానంలో మోకరిల్లాడు.