పెద్ద గండం నుంచి గట్టెక్కానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్నా ఆట ఎప్పటికప్పుడూ కొత్త పరీక్ష పెడుతుందన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన తర్వాత అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉందని కోహ్లీ చెప్పాడు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) అజేయ అర్థశతకంతో రాణించాడు. దాంతో ఈ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఈ విజయానంతరం దిగ్గజ క్రికెటర్లు రవి శాస్త్రి, ఆడమ్ గిల్క్రిస్ట్లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాతో పాటు ప్రేక్షకులకు విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.

'అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్నా ఆట కొత్త దారులను చూపిస్తోంది. తొలి రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన తర్వాత ఈ మ్యాచ్లో రాణించడం సంతోషంగా ఉంది. పెద్ద గండం నుంచి గట్టెక్కిన ఫీలింగ్ కలుగుతోంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు రాణించడం సవాల్గా ఉంటుంది. ఈ కఠిన పరిస్థితులే నా అత్యుత్తమ ఆటను బయటకు తీస్తాయి. ఇంకొన్ని రోజుల్లో నాకు 37 ఏళ్లు నిండనున్నాయి. కానీ ఛేజింగ్ ఎప్పుడూ నాలో ఉత్తమమైన ఆటను బయటకు తెస్తుంది. రోహిత్ శర్మతో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉంది.
రోహిత్తో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ. ఈ మ్యాచ్లో మేం కండిషన్స్ను బాగా అర్థం చేసుకున్నాం. జోడీగా మేం ఆటను ఆస్వాదిస్తాం. బహుషా మేం ఇప్పుడు అత్యంత అనుభవమైన జోడీ కావచ్చు. కానీ మేం కుర్రాళ్లుగా ఉన్నప్పుడే మంచి భాగస్వామ్యంతో జట్టును గెలిపించగలమని గ్రహించాం. మా జోడీ ప్రయాణం 2013లో స్వదేశంలో ఆసీస్తో జరిగిన సిరీస్లో మొదలైంది. 20 ఓవర్లు మేం ఇద్దరం కలిసి ఆడితే మ్యాచ్లు ఏకపక్షంగా ముగుస్తాయని ప్రత్యర్థులకు కూడా తెలుసు. ఆస్ట్రేలియాకు రావడం మాకు చాలా ఇష్టం. ఇక్కడ మేం అత్యుత్తమ క్రికెట్ ఆడాం. ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరై మాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు'అని కోహ్లీ తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మాథ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 232 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్(24) మరోసారి విఫలమవ్వగా.. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.