
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు కౌంట్డౌన్ మొదలైంది. మరో 9 రోజుల్లో ఈ మెగాపోరుకు తెరలేవనుంది. జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ వేదికగా ఈ టైటిల్ పోరు జరగనుంది. ఫస్ట్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ కావడంతో సర్వత్రా ఆసక్తినెలకొంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఇప్పుడు ఈ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటుంది. గెలుపు అంచనాలు, తుది జట్ల ఎంపికపై ఇప్పటికే జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఈ మ్యాచ్కు ఓ ఆసక్తికరమైన విషయం అందర్ని కట్టిపడేస్తుంది. వారెవ్వా అంటూ నోరెళ్లబెట్టిస్తుంది. ఇంతకీ ఆ సంగతేంటంటే.. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్ల కెప్టెన్ల జెర్సీ నెంబర్లు, షెడ్యూల్ తేదీలు మ్యాచ్ అయ్యాయి. అవును టెస్ట్ల్లో విరాట్ కోహ్లీ 18వ నెంబర్ జెర్సీ ధరిస్తుండగా.. విలియమ్సన్ 22వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగుతాడు.
కాకతాళీయమో ఏమో కానీ ఈ ఫైనల్ మ్యాచ్ 18 నుంచి 22 వరకు జరగనుంది. వారి జెర్సీ నెంబర్లతో మ్యాచ్ ఆరంభ, ముగింపు తేదీలు భలే కలిసిపోయాయి. ఇప్పుడిదే విషయం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ విషయం తెలసుకున్న నెటిజన్లు అంతా.. అవును కదా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే భారత జట్టు సౌతాంప్టన్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బబుల్లో ఔట్డోర్ ప్రాక్టీస్ చేస్తుండగా.. మరోవైపు కివీస్.. ఆతిథ్య ఇంగ్లండ్తో రెండు టెస్ట్ల సిరీస్ ఆడుతూ సమాయత్తం అవుతోంది. తొలి టెస్ట్ డ్రా చేసుకున్న ఆ జట్టు.. రెండో మ్యాచ్కు సిద్దమవుతోంది. అయితే మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం టీమిండియా కొంపముంచుతుందని, ఇంగ్లండ్తో రెండు టెస్ట్ల సిరీస్ న్యూజిలాండ్కు లాభం చేకూర్చుతుందని భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
దాంతో ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్లో టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుందంటున్నారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అలా ఏం ఉండదని, ఎవరూ బాగా ఆడితే వారినే విజయం వరిస్తుందని మ్యాచ్కు ముందు మీడియా సమావేశంలో తెలియజేశాడు.