
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతను చేసిన పరుగులే విరాట్ ఎంతటి విలువైన ఆటగాడనే విషయాన్ని తెలియజేస్తాయి. మైదానంలో పరుగుల వరద పారించే విరాట్.. ఈ తరం అత్యుత్తమ ఆటగాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిలకడలేమి ఫామ్తో గత మూడేళ్లు సతమతమైనా.. అతనికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మైదానంలో పరుగుల రారాజుగా కొనసాగుతున్న విరాట్.. అటు డబ్బులు సంపాదించడంలోనూ.. ఇటు అభిమానులను ఆకట్టుకోవడంలోనూ తిరుగులేని శక్తిగా దూసుకెళ్తున్నాడు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న తొలి అంతర్జాతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనే విషయం అందరికి తెలిసిందే.
ఇన్స్టాగ్రామ్లో 200 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా అరుదైన ఘనతలను అందుకున్నాడు. భారత్లో ఈ ఏడాది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అత్యధిక మంది విరాట్ కోహ్లీ హ్యాష్ ట్యాగ్ వాడారు. ఈ ఏడాది రీల్స్లో ఉపయోగించిన టాప్-2 పాపులర్ క్రికెటర్ హ్యాష్ ట్యాగ్స్ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ విషయాన్ని ఫేస్బుక్ సంస్థ మెటా ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్, ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ హ్యాష్ ట్యాగ్స్ సైతం రీల్స్లో అత్యధికంగా వాడారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్కు సంబంధించి 1 మిలియన్కు పైగా రీల్స్ ట్రెండ్ అయ్యాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ.. టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. మూడు వన్డేల సిరీస్లో సెంచరీతో దుమ్మురేపిన విరాట్.. తొలి టెస్ట్లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఒక్క పరుగుకే వెనుదిరిగిన అతను.. రెండో ఇన్నింగ్స్లో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లాతో మూడో వన్డేలో సెంచరీ బాది మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు.
ఆసియా కప్ 2022 ముందు వరకు నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ.. నెల రోజుల సుదీర్ఘ విరామంతో మళ్లీ టచ్లోకి వచ్చాడు. ఆసియాకప్లో అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ మార్క్ అందుకున్న కోహ్లీ మూడేళ్ల తర్వాత 71 సెంచరీ నమోదు చేశాడు. అదే జోరులో టీ20 ప్రపంచకప్లో నాలుగు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన విరాట్.. బంగ్లాదేశ్తో మూడో వన్డేలో సెంచరీ సాధించాడు. కాకతాళీయమో ఏమో కానీ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే 71, 72వ సెంచరీలు బాదిన కోహ్లీ.. ఈ రెండు శతకాలను సిక్సర్లతో అందుకున్నాడు. గురువారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్లోనూ విరాట్ సెంచరీ సాధించి.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.