క్రికెట్ అభిమానుల కోసం ధనాధన్ టీ20 పండుగకు తెరలేచింది. ఫ్రాంచైజీ క్రికెట్ ఎలాంటి వినోదాన్ని అందించినా అసలు కిక్కు మాత్రం మన దేశం అనడంలోనే ఉంది. కాబట్టే టీ20 ప్రపంచకప్కు ప్రత్యేకమైన క్రేజ్. అందుకే గత 16 ఏళ్లలో 8 మెగా టోర్నీలు వందశాతం ఆనందాన్ని పంచాయి. ఈ సారి అంతకుమించిన సంతోషాన్ని పంచేందుకు మరో టీ20 ప్రపంచకప్కు తెరలేచింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 20 జట్లు బరిలో నిలిచాయి. ఆయా జట్ల నుంచి మొత్తం 300 మంది ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. ఎన్ని జట్లు బరిలో ఉన్నా.. విజేతగా నిలిచేది మాత్రం ఒక జట్టే. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తూ తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే వారుంటారు. అయితే తుది ఫలితాలతో సంబంధం లేకుండా ఒకే ఒక్కడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రూపంలో పురస్కారం లభిస్తోంది.

2014, 2016 కోహ్లీకే..
బంగ్లాదేశ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2014లో శ్రీలంక విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ను ఓడించిన శ్రీలంక తొలి టీ20 ప్రపంచకప్ను అందుకుంది. ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 319 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. దాంతో ఫైనల్లో భారత్ ఓడినా.. విరాట్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది.
భారత్ వేదికగా జరిగిన మరుసటి టీ20 ప్రపంచకప్ 2016లోనూ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ సెమీస్లోనే వెనుదిరిగింది. వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించిన వెస్టిండీస్ రెండో సారి ఛాంపియన్గా నిలిచింది.
ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడిన కోహ్లీ మూడు హాఫ్ సెంచరీలతో 273 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఈ సారి కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకునేందుకు కోహ్లీ సిద్దంగా ఉన్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ మరో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అందుకునేందుకు సిద్దంగా ఉన్నాడు. ఈ సారి కూడా ఈ అవార్డు అందుకుంటే మూడు సార్లు ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కనున్నాడు.
మూడే సార్లే ఛాంపియన్ ప్లేయర్కు..
గత 8 టోర్నీల్లో ఛాంపియన్ టీమ్స్ ప్లేయర్లు మూడు సార్లు మాత్రమే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు. 2010లో ఇంగ్లండ్ విజేతగా నిలవగా.. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ 6 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 243 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురుస్కారాన్ని స్వీకరించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ, కరోనా కారణంగా ఐదేళ్ల విరామం తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ ఓడించి తొలి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ 7 మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 289 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ విజేతగా నిలవగా.. సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ టోర్నీగా నిలిచాడు. 6 మ్యాచ్ల్లో అతను 13 వికెట్లు తీసాడు.