
కోహ్లీ ఒక్కడే కాదు..
2019 నవంబర్ 22న బంగ్లాదేశ్పై ఏకైక టెస్ట్లో చివరి సెంచరీ బాదిన విరాట్.. మళ్లీ మూడెంకల స్కోర్ అందుకోలేకపోయాడు. అయితే సెంచరీ చేయకపోయినా 24 హాఫ్ సెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. అయితే టీమిండియాలో కోహ్లీ ఒక్కడే కాకుండా మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా సెంచరీ చేయక చాలా రోజులు అవుతుంది. విరాట్ పేలవ ఫామ్ నేపథ్యంలో వీళ్లు విమర్శలకు దూరంగా ఉన్నారు. ఈ జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఉన్నాడు.

రెండేళ్లుగా రోహిత్ శర్మకు సెంచరీ లేదు..
విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ.. సుదీర్ఘ ఫార్మాట్లో గతేడాది సెంచరీ బాదినా పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. దాదాపు రెండేళ్లుగా వైట్ బాల్ క్రికెట్లో రోహిత్కు సెంచరీ లేదు. టెస్టుల్లో 2021 ఫిబ్రవరిలో ఇంగ్లండ్పై, సెప్టెంబర్లో ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన రోహిత్ శర్మ... పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ మార్కు అందుకోలేకపోతున్నాడు. టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసి టాప్లో నిలిచిన రోహిత్ శర్మ, ఈ ఏడాది ఇప్పటిదాకా పొట్టి ఫార్మాట్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. 2020 జనవరిలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన రోహిత్ శర్మ, రెండున్నరేళ్లుగా వన్డేల్లో సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు.

మూడేళ్లుగా పుజారా..
వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో వరుసగా ఐదు సెంచరీలు బాది సరికొత్త రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ, రికీ పాంటింగ్ 30 వన్డే సెంచరీల రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ చతేశ్వర్ పూజారా సైతం గత మూడేళ్లుగా సెంచరీ చేయలేదు. 2019 జనవరి 3న సిడ్నీ వేదికగా చివరి సెంచరీ చేసిన పూజారా.. ఇప్పటి వరకు మూడెంకల స్కోర్ అందుకోలేదు. పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన పూజారా, రంజీ ట్రోఫీ 2022లో రెండు, కౌంటీ ఛాంపియన్షిప్లో నాలుగు సెంచరీలు చేసి తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే ఐదో టెస్టులోనూ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు.

శిఖర్ ధావన్ సైతం..
భారత ఓపెనర్ శిఖర్ ధావన్కు టెస్టుల్లో ఏడు, వన్డేల్లో 17 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో హాఫ్ సెంచరీల కంటే సెంచరీలు ఎక్కువ చేసిన ప్లేయర్లలో శిఖర్ ధావన్ ఒకడు. అయితే పేలవ ఫామ్ కారణంగా ధావన్ టెస్ట్ క్రికెట్తో పాటు టీ20ల్లోనూ చోటు కోల్పోయాడు. వన్డేల్లో కీలక సభ్యుడిగా రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తున్న శిఖర్ ధావన్, చివరిగా 2019 జూన్ 9న ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. ఆ తర్వాత మూడేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. కెప్టెన్గా వెస్టిండీస్ పర్యటనకు వెళ్తున్న అతను అక్కడైన ఈ సెంచరీ మార్క్ అందుకొని వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications
