టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అత్యంత విలువైన భారత సెలబ్రిటీగా గుర్తింపు పొందాడు.సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ క్రోల్(Kroll) 2023 నివేదిక ప్రకారం కోహ్లీ ప్రస్తుత బ్రాండ్ వాల్యూ రూ.1901 కోట్లు. గతేడాది(2022)తో పోలిస్తే కోహ్లీ విలువ 29 శాతం పెరగడం విశేషం.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ స్టార్స్ రణ్వీర్ సింగ్(రూ. 1693 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ.1001 కోట్లు) అధిగమించాడు. దాంతో భారత్లోనే అత్యంత విలువైన సెలబ్రిటీగా అవతరించాడు. ఈ జాబితాలో 2017 నుంచి అగ్రస్థానంలోనే కొనసాగిన కోహ్లీ.. 2022లో మాత్రం రెండో స్థానంలో నిలిచాడు. మొత్తం ఆరు సార్లు భారత్లో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచాడు.

మోస్ట్ బ్రాండ్ వాల్యూ కలిగిన భారత క్రికెటర్లలో కోహ్లీ తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్లు ఉన్నారు.
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024 ఆడుతున్న విరాట్ కోహ్లీ.. లీగ్ దశలో దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న అమెరికా పిచ్లపై రెండంకెల స్కోర్లు చేయలేకపోయాడు. మూడు మ్యాచ్ల్లో 1, 4, 0తో దారుణంగా విఫలమయ్యాడు. ఓపెనర్గా ఆడటం కూడా విరాట్ కోహ్లీ వైఫల్యానికి కారణమనే చర్చ కూడా జరుగుతోంది.
కోహ్లీ విఫలమైనా టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 చేరింది. అయితే సూపర్ 8 మ్యాచ్లన్నీ వెస్టిండీస్లో జరగనున్నాయి. స్పిన్కు అనుకూలంగా ఉండే ఇక్కడి వికెట్లపై విరాట్ కోహ్లీ రాణించడం టీమిండియాకు కీలకం కానుంది. ఐపీఎల్ 2024 సీజన్లో లీడింగ్ స్కోరర్గా నిలిచిన కోహ్లీ.. ఆ జోరును టీ20 ప్రపంచకప్లో కొనసాగించలేకపోయాడు.
కనీసం సూపర్ 8లోనైనా చెలరేగాలని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సూపర్-8లో టీమిండియా.. అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లతో ఆడనుంది. తొలి మ్యాచ్ గురువారం అఫ్గాన్తో బార్బోడస్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఆడనుండగా టీమిండియా.. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను బరిలోకి దించనుంది.